వీధి కుక్కను చంపిన నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2022-08-21T08:21:28+05:30 IST
ఓ వీధి కుక్కను అమానుషంగా కొట్టి చంపి, ఆపై బైక్కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి పోలీసులు శనివారం నలుగురిని అరెస్టు చేశారు.
మేనకా గాంధీ వినతికి స్పందించిన కరీంనగర్ పోలీసులు
కరీంనగర్ క్రైం, ఆగస్టు 20: ఓ వీధి కుక్కను అమానుషంగా కొట్టి చంపి, ఆపై బైక్కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి పోలీసులు శనివారం నలుగురిని అరెస్టు చేశారు. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ చేసిన వినతి మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. కొత్తపెల్లి మండలంలోని సంగం క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 15న కొందరు వ్యక్తులు ఓ వీధి కుక్కను చంపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన హైదరాబాద్కు చెందిన పృథ్వీ పన్నీరు ఈ విషయాన్ని మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె శుక్రవారం రాత్రి కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన పోలీసులు.. పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.