కృష్ణా ట్రైబ్యునల్ కోసం.. నేడు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
ABN , First Publish Date - 2022-11-25T02:45:38+05:30 IST
కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారానికి.. కొత్త ట్రైబ్యునల్ వేయడం లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కే ఆ బాధ్యతను అప్పగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనుంది.
హైదరాబాద్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారానికి.. కొత్త ట్రైబ్యునల్ వేయడం లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కే ఆ బాధ్యతను అప్పగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై గురువారం హైదరాబాద్ జలసౌధలో ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ (సీఈ) మోహన్కుమార్ తదితరులతో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా స్వల్ప సవరణలు ఆయన ప్రతిపాదించారు. సవరణలు చేసిన యంత్రాంగం.. పిటిషన్ను డాక్టర్ రజత్కుమార్కు పంపించింది. ఆయన ఆమోదించడంతో శుక్రవారం రిట్ దాఖలు చేయనున్నారు. కాగా, తెలంగాణ ఆవిర్భావం నుంచే కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ కోసం ప్రభుత్వం పట్టుబడుతున్నది. అప్పట్లోనే సుప్రీంలో కేసు వేయగా.. దానిని వెనక్కి తీసుకుంటే ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? లేక వివాదాన్ని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కే బదలాయించాలా? అనేది నిర్ణయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ కేసును వెనక్కుతీసుకుంది. అయితే, బ్రిజే్షకుమార్ ట్రైబ్యునల్ ఉన్నందున కొత్త ట్రైబ్యునల్ అక్కర్లేదంటూ కేంద్రం మాట మార్చింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకు వెళ్లాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ఉన్నప్పుడు.. పరిష్కారం కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం కొత్త ట్రైబ్యునల్ వేయడానికి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం వెసులుబాటు కల్పించింది. దీన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేయనుంది.