TS News: మీటర్ల పేరుతో కేసీఆర్‌ అబద్ధాల ప్రచారం: ఈటల రాజేందర్‌

ABN , First Publish Date - 2022-10-03T02:08:40+05:30 IST

బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

TS News: మీటర్ల పేరుతో కేసీఆర్‌ అబద్ధాల ప్రచారం: ఈటల రాజేందర్‌

మునుగోడు: బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.  ఇలాంటి తప్పుడు మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్‌లో తాను గెలిచి ఏడాదైనా ఇప్పటికీ మీటర్లు పెట్టలేదని తెలిపారు. కేసీఆర్‌, బంగారు తెలంగాణ పేరుతో ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. సబ్బండ వర్గాల ప్రజల కలలను నెరవేర్చకుండా కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో ఖర్చు చేసే కోట్లాది రూపాయల ప్రజాధనం ఆయన కుటుంబీకులకు కమీషన్‌ రూపంలో వెళ్తోందని ఆరోపించారు.


దీంతో ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు, గ్రామాల్లో అభివృద్ధి పథకాలకే కాదు, ఉద్యోగుల జీతాలకు కొరత నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తిరిగేందుకు విమానం కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన విమానం కొనుగోలుకు విరాళాలు వచ్చాయంటున్న సీఎం అవి ఎక్కడి నుంచి వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్‌ మార్పు కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-10-03T02:08:40+05:30 IST