డూప్లికేట్ ఓటర్లు.. 4.56 లక్షలు!
ABN , First Publish Date - 2022-02-16T08:06:37+05:30 IST
హైదరాబాద్ జిల్లా పరిధిలో డూప్లికేట్ ఓటర్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఆధార్ కార్డు నెంబరు, ఫొటోల ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో పేర్లున్న వ్యక్తులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ
- హైదరాబాద్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ షురూ
- నియోజక వర్గం పరిధి ప్రామాణికంగా ప్రక్రియ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లా పరిధిలో డూప్లికేట్ ఓటర్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఆధార్ కార్డు నెంబరు, ఫొటోల ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో పేర్లున్న వ్యక్తులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. సాంకేతిక గుర్తింపు ప్రక్రియలో జిల్లాలో 4.56 లక్షల డూప్లికేట్ ఓటర్లున్నారని.. మరణించిన, చిరునామా మారిన ఓటర్ల సంఖ్య 83 వేలకుపైగా ఉందని తేల్చారు. అసెంబ్లీల వారీగా డూప్లికేట్ ఓటర్లు ఎంత మంది..? వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించాల్సిన వారి సంఖ్య ఎంత..? అన్న వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గాల పరిధిని ప్రామాణికంగా తీసుకుంటే 10ు డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తేలింది. హైదరాబాద్ జిల్లా, గ్రేటర్ ప్రామాణికంగా గుర్తింపు చేపడితే ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువయ్యే అవకాశముందని తెలస్తోంది. ప్రస్తుతం ఫొటోల ఆధారంగా డూప్లికేట్ ఓటర్ల గుర్తింపును చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. నెట్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచింది. దాని ఆధారంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో డూప్లికేట్ ఓటర్ల తొలగింపు చేపట్టామని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
ఓటర్ల సంఖ్య ఎక్కువ..
గ్రేటర్ జనాభా 1.20కోట్ల వరకు ఉంటుందని అంచనా. గత నెలలో విడుదల చేసిన జాబితా ప్రకారం 89.34లక్షల మంది ఓటర్లున్నారు. జనాభాలో ఓటర్లు 55-60ు మాత్రమే ఉండాలి. గ్రేటర్లో 75ు ఓటర్లున్నారు. దీంట్లో 15-20ు బోగస్ ఓటర్లే అని అంచనా. హైదరాబాద్ జిల్లాలో 72 శాతానికిపైగా ఓటర్లున్నారు. నగరంలో అద్దె ఇళ్లలో ఉండే చాలా కుటుంబాలు పలు కారణాలతో ఒక ప్రాంతం నుంచి మరో ఏరియాకు మారుతుంటారు. సొంత ఇల్లున్నా పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు నియోజకవర్గాల పరిధి దాటి వెళ్తుంటారు. నగరంలో ఒకే వ్యక్తికి 2, 3 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండడానికి ప్రధాన కారణం ఇదే. వాస్తవానికి ఒక ప్రాంతంలో ఓటు హక్కు ఉండి.. మరో ఏరియాలో పేరు నమోదు చేసుకోవాలనుకుంటే.. అప్పటికే నమోదైన ఓటు తొలగింపునకు దరఖాస్తు చేయాలి. మెజారిటీ పౌరులు అలా చేయడం లేదు. దీంతో డూప్లికేట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. న ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానం చేయాలన్న కేంద్రం నిర్ణయం అమల్లోకి వస్తే హైదరాబాద్లో వాస్తవ ఓటర్లు ఎంత మంది..? అన్న లెక్క తేలనుంది.