రక్తదానం చేసి ప్రాణదాతలవ్వండి: తమిళిసై
ABN , First Publish Date - 2022-08-17T10:40:13+05:30 IST
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణ దాతలు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి చెందిన నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను రాజ్భవన్లో గవర్నర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లు రక్తదాతల వద్దకే వెళ్లి రక్తాన్ని సేకరించేందుకు ఉపయోగపడతాయన్నారు. నూతన సదుపాయం వల్ల రక్తదాతలు మరింత ముందుకు వస్తారని గవర్నర్ అభిలషించారు. నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను హైదరాబాద్, కరీంనగర్, హనుమకొండ, నిజామాబాద్ జిల్లాల రెడ్క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. తెలంగాణ రెడ్క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా పాల్గొన్నారు.