బీజేపీ నేతపై దాడి
ABN , First Publish Date - 2022-08-17T05:28:30+05:30 IST
బీజేపీ నేతపై దాడి
పరకాలలో టీఆర్ఎస్ నాయకుల చర్య
దాడి ని నిరసిస్తూ బీజేపీ శ్రేణుల ధర్నా, రాస్తారోకో
పరకాల, ఆగస్టు 16: హనుమకొండ జిల్లా పరకాలలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్పై దాడి జరిగింది. గురుప్రసాద్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఏకు రాజు, బొచ్చు జెమిని, ఏకుసుభా్షలు వాహనం ఆపి దాడిచేశారు. దీంతో అస్వస్థతకు గురైన గురుప్రసాద్ను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంలో వైద్యుల సలహా మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ విజయచందర్రెడ్డి, అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఏనుగు రాకే్షరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్తో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులు పరకాలకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, పోలీసుల తీరు నశించాలంటూ నినాదాలు చేశారు. ఏసీపీ శివరామయ్య, సీఐ కిషన్, ఎస్సై ప్రశాంత్బాబులు బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
కాచం గురుప్రసాద్పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్రీదేవి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఏకు రాజు, ఏకు సుభాష్, బొచ్చు జెమినితో పాటు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ విషయంపై సీఐ కిషన్ను వివరాణ కోరగా తాగిన మైకంలో దాడికి చేశారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.