Uppal Match: హైదరాబాద్ చేరుకున్న ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు
ABN , First Publish Date - 2022-09-24T23:33:43+05:30 IST
ఇండియా, ఆస్ట్రేలియా (India Australia) క్రికెటర్లు హైదరాబాద్ చేరుకున్నారు. నాగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు.
హైదరాబాద్: ఇండియా, ఆస్ట్రేలియా (India Australia) క్రికెటర్లు హైదరాబాద్ చేరుకున్నారు. నాగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport)కు క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తాజ్ కృష్ణ, పార్క్ హయత్ హోటల్స్లో ప్లేయర్స్ జసచేయనున్నారు. ఆదివారం ఉదయం ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో నెట్ ప్రాక్టీసులో క్రికెటర్స్ పాల్గొననున్నారు. రేపు రాత్రి 7.30 గంటలకు టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. రేపటి టీ20 మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ కోసం హెచ్సీఏ (HCA) బాగానే సన్నద్ధమైంది. 2500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 300కుపైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మైదానంలోని ప్రతి వ్యక్తి కదలికలను పోలీసులు పర్యవేక్షించనున్నారు. అలాగే, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు, స్నేక్ క్యాచర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
ఇంత వరకు సూపర్ అనే చెప్పుకోవాలి. కొసరు విషయాలన్నింటిపైనా బాగనే శ్రద్ధ పెట్టిన హెచ్సీఏ ప్రేక్షకుల సమస్యలను మాత్రం గాలికొదిలేసింది. సీట్లు పరమచెత్తగా ఉన్నాయి. స్టేడియంలో సగానికి పైగా సీట్లు కూర్చోవడానికే వీలులేకుండా ఉన్నాయి. మూడేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్పై ఇంత నిర్లక్ష్యం కూడదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటకొచ్చిన ఫొటోలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్కు ఇంకా కొన్ని గంటల సమయం మిగిలే ఉండడంతో ఇప్పటికైనా హెచ్సీఏ అధికారులు, మరీ ముఖ్యంగా దాని చీఫ్ అజారుద్దీన్ దీనిపై దృష్టి సారిస్తాడో? లేదో? చూడాల్సిందే.