కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర: కూనంనేని
ABN , First Publish Date - 2022-12-12T04:24:12+05:30 IST
ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
హైదరాబాద్/ఖమ్మం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలులో విఫలమైన తర్వాత బీజేపీ.. తెలంగాణలో ఈడీ, ఐటీ, సీబీఐ దాడులను వేగవంతం చేసిందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ కవితపై ఎలా విచారణ జరుపుతోందని ప్రశ్నించారు. విచారణ రాజకీయ దురుద్దేశం లేకుండా నిష్పక్షపాతంగా చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నామా నాగేశ్వరరావు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర, మల్లారెడ్డిలపై ఈడీతో దాడులు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎ్సలో ఉంటే సీఎం కాలేరని, సీఎం కావాలంటే తమ పార్టీలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు.