ఖమ్మం- విజయవాడ మధ్య పలు రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2022-09-10T14:43:35+05:30 IST
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కొండపల్లి- రాయనపాడు మధ్య మూడో లైను పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఖమ్మం- విజయవాడ మీదుగా వెళ్లే పలు
Khammam: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కొండపల్లి- రాయనపాడు మధ్య మూడో లైను పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఖమ్మం- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ట్రాకులను నిర్మిస్తుండడం, పాత వాటికి అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. సెప్టెంబర్ 20 వరకు ఇదే పరిస్థితి ఉండనుంది.
తిరుపతి - ఖాజీపేట ప్రత్యేక రైళ్లు కూడా...
కొండపల్లి- రాయనపాడు వద్ద లైనుపనుల కారణంగా ఖాజీపేట- తిరుపతి, తిరుపతి - ఖాజీపేట ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్- గుంటూరు మధ్య నడిచే గోల్కొండ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకే నడుపుతున్నారు. మరికొన్నింటిని విజయవాడ, గుంటూరు, నల్లగొండ మార్గంలో నడుపుతున్నారు. సికింద్రాబాద్- తిరుపతి ప్రత్యేక రైలు ద్రోణాచలం, గుత్తి మీదుగా నడుపుతున్నారు.