ఆపరేషన్లలో అప్రమత్తంగా ఉండండి: హరీశ్
ABN , First Publish Date - 2022-09-10T08:22:06+05:30 IST
కుటుంబ నియంత్రణ, కంటి శస్త్రచికిత్సలు చేసేటప్పుడు స్టెరిలైజేషన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కుటుంబ నియంత్రణ, కంటి శస్త్రచికిత్సలు చేసేటప్పుడు స్టెరిలైజేషన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఇబ్రహీంపట్నం ఘటనలో నలుగురు చనిపోయిన నేపథ్యంలో.. సర్జరీల విషయంలో వైద్యులంతా మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కుటుంబ నియంత్రణ, కంటి శస్త్రచికిత్సలప్పుడు పరికరాల స్టెరిలైజేషన్ సరిగా ఉందో లేదో నిర్ధారించుకోవాలన్నారు. ఎంత బాగా పని చేస్తున్నప్పటికీ ఒక చిన్న పొరపాటుతో బద్నాం కావాల్సి వస్తోందని తెలిపారు. 15న రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ ఆధ్వర్యంలోనే రక్తదాన శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. కొన్ని ఆస్పత్రుల్లో డయాలసిస్కు ఎక్కువ సమయం పడుతోందని, వెంటనే నూతన యంత్రాలను సమకూర్చాలని సూచించారు.