ఏడాదైనా ‘పల్లె ప్రగతి’ బిల్లులేవీ?
ABN , First Publish Date - 2022-05-30T09:22:21+05:30 IST
గతేడాది నిర్వహించిన నాలుగో విడత ‘పల్లె ప్రగతి’ పనుల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదివారం లేఖ రాశారు.
నిధులు విడుదల చేయాలని కేసీఆర్కు ఉత్తమ్ లేఖ
నల్లగొండ/హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గతేడాది నిర్వహించిన నాలుగో విడత ‘పల్లె ప్రగతి’ పనుల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో గ్రామానికి రూ.2-10 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, పాత బిల్లులు మంజూరు చేయకుండానే ఐదో విడతకు అధికారులు సిద్ధమవడం సరికాదన్నారు. బిల్లులు పెండింగ్లో ఉండటంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది జీతాలు, డీజిల్, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉత్తమ్ సూచించారు. ఈ లేఖను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, హరీశ్రావులకు సైతం పంపారు.
కాంగ్రెస్లోకి బండ్రు శోభారాణి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమెరికాలో శనివారం జరిగిన ఇండియన్ ఒవర్సీస్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ల సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.