బతుకమ్మ చీరలపై ఆగ్రహ ‘జ్వాలలు’
ABN , First Publish Date - 2022-09-22T07:56:12+05:30 IST
ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండడంతో ఆ మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
- నాసిరకమంటూ నిప్పు పెట్టిన మహిళలు
- నాగర్కర్నూల్ జిల్లా మంచాలకట్టలో ఘటన
పెంట్లవెల్లి, సెప్టెంబరు 21 : ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండడంతో ఆ మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ చీరలన్నింటినీ కుప్పగా పోసి నిప్పంటించారు. ఈ ఘటన నాగర్కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల పరిధిలోని మంచాలకట్టలో బుధవారం జరిగింది. బుధవారం ఉదయం ఉప సర్పంచ్ గోపి నాయుడు, పంచాయతీ కార్యదర్శి అశ్విని, రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆ చీరలను పరిశీలించిన 20 మంది మహిళలు నాణ్యంగా లేవని కుప్పగా పోసి నిప్పంటించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారని రెండు రోజులుగా పనులు మానుకొని ఉంటే తీరా నాణ్యతలేనివి పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.