నాణ్యమైన విత్తనాలతోనే వ్యవసాయాభివృద్ధి
ABN , First Publish Date - 2022-09-10T09:09:01+05:30 IST
ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని, నాణ్యమైన విత్తనాలతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని, నాణ్యమైన విత్తనాలతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జాతీయ విత్తన సంఘం ఆధ్వర్యంలో ‘బయో టెక్నాలజీతో పంటల అభివృద్థి’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. ప్రపంచ విత్తన పరిశ్రమలో భారతదేశం ఐదో స్థానంలో ఉన్నదన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రైవేటు రంగంలో విత్తన పరిశ్రమ వృద్థి చెందిందని అన్నారు. ప్రజల ఆహార అవసరాల దృష్ట్యా మరింత వృద్ధిచెందాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో పత్తి విత్తనాల్లో 50శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఈ సదస్సులో జాతీయ విత్తన సంఘం అధ్యక్షులు, నూజీవీడు సీడ్స్ అధినేత ప్రభాకరరావు పాల్గొన్నారు.