Raja Singh: రాజాసింగ్ పీడీ యాక్ట్పై ముగిసిన అడ్వైజరీ బోర్డు విచారణ
ABN , First Publish Date - 2022-09-29T21:45:39+05:30 IST
ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పీడీ యాక్ట్పై అడ్వైజరీ బోర్డు (Advisory Board) విచారణ ముగిసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పీడీ యాక్ట్పై అడ్వైజరీ బోర్డు (Advisory Board) విచారణ ముగిసింది. చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా ఆయనను విచారించారు. పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబసభ్యులు కూడా విచారణకు హాజరయ్యారు. పోలీసుల తరపున డీసీపీ జోయల్ డేవిస్, మంగళ్హాట్ పోలీసులు హాజరయ్యారు. పీడీ యాక్ట్ ప్రయోగంపై రాజాసింగ్ అభ్యంతరాలను బోర్డు తెలుసుకుంది. పీడీ యాక్ట్ పెడ్డడానికి దారితీసిన పరిస్థితులను బోర్డుకు పోలీసులు వివరించారు.
విచారణ అనంతరం రాజాసింగ్ అడ్వకేట్ కరుణసాగర్ మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ భార్య అడ్వైజరీ బోర్డుకు అప్పీల్ దాఖలు చేశారని, పీడీ యాక్ట్ను తొలగించాలని అప్పీల్లో పేర్కొన్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే పీడీ యాక్ట్ పెట్టారని బోర్డుకు తెలిపారని, అడ్వైజరీ బోర్డు రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే.. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, దీనిపై ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కరుణాసాగర్ తెలిపారు.
ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ పెట్టారు. రాజాసింగ్పై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వందకు పైగా కేసులు నమోదు చేశారు. మత ఘర్షణలకు దారితీసేవిధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగళ్హాట్, షాహినాథ్గంజ్లో రాజాసింగ్పై రౌడీషీట్లు ఓఫెన్ చేశారు. యూట్యూబ్ చానల్ (YouTube channel) ద్వారా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పలు ప్రాంతాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలతో ఘర్షణలు చెలరేగాయి. గతంలో ఘర్షణలకు తావిచ్చే వ్యాఖ్యలు చేయవద్దని పోలీసుల సూచించారు. పోలీసుల సూచనలను పట్టించుకోలేదు. పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదు చేశారు.
పీడీ యాక్ట్ ఎత్తివేయాలంటే అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే మూలాఖత్ ద్వారా రాజాసింగ్ను కుటుంబసభ్యులు కలిశారు. నిజానికి పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు.. జైలులో 3 నెలలు లేదా కనీసం ఏడాది ఉండే అవకాశం ఉంది. అడ్వైజరీ బోర్డు పరిధిలోనే పీడీ యాక్ట్ కేసుల విచారణ జరగనుంది. ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తుల(Retired Judge)తో అడ్వైజరీ బోర్డు కమిటీ నియమించారు. ఇప్పటికే బోర్డుకు పోలీసులు సాక్ష్యాలు సమర్పించారు. నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. కమిటీ విచారణ తర్వాతే హైకోర్టు(High Court)లో పిటిషన్కు అవకాశం ఉంది. ఇలా విచారణకు వచ్చిన పలు కేసుల్లో పీడీ యాక్ట్ను కమిటీ ఎత్తివేసింది. ప్రత్యేక తెలంగాణ(Telangana) ఉద్యమంలో 2,573 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయి. గతేడాది 664 మందిపై పోలీసులు పీడీ యాక్ట్ను నమోదు చేశారు.