ఆ మాయ లేడి.. ఎవరు?
ABN , First Publish Date - 2022-10-02T04:47:49+05:30 IST
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న భవన నిర్మాణాలపై వరుస ఫిర్యాదులు చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్న అపరిచిత మాయలేడి ఎవరన్నదే పట్టణంలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 133 భవనాలు అక్రమంగా నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని పేర్కొంటూ ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది. సా
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆ పేరు వింటేనే హడల్
వరుసగా 133 భవన నిర్మాణాలపై ఫిర్యాదులు
అపరిచిత మహిళ ఫిర్యాదుపై అధికారుల ఆరా
నోటీసుల జారీతో ఇంటి యజమానుల ఆందోళన
ఆదిలాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న భవన నిర్మాణాలపై వరుస ఫిర్యాదులు చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్న అపరిచిత మాయలేడి ఎవరన్నదే పట్టణంలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 133 భవనాలు అక్రమంగా నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని పేర్కొంటూ ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏదైనా కొత్త భవనాల నిర్మాణం చేపట్టిన సమయంలో ఇంటి పక్క వారో లేక కాలనీ వాసులు, స్థానిక కౌన్సిలరో అధికారులకు ఫిర్యాదు చేయడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఎలాంటి చిరునామా లేకుండా అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై ఓ మహిళ పేరిట కావాలనే ఫిర్యాదులు చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు నిబంధనల ప్రకారం టీఎస్ బీపాస్ ద్వా రా ఇంటి నిర్మాణ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత డా క్యుమెంట్స్ ఆధారంగా ప్రత్యేక అధికారుల బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇందుకు గాను మున్సిపల్ పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భవన నిర్మా ణ అనుమతుల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. కానీ కొందరు గుట్టుచప్పుడుకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఫిర్యాదులు వచ్చిన స్థానిక నేతల ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా టీఎస్ బీపాస్ అ మలు తర్వాత ఇంటి నిర్మాణ అనుమతుల ప్రక్రియ కొంత సజావుగానే జరుగుతున్న అక్కడక్కడ మాత్రం కొన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాం టి లొసుగులను ఆస రాగా చేసుకుంటున్న కొందరు స్థానిక నేతలు, దళారులు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ దరఖాస్తుదారులను బ్లాక్ మెయిల్ చేసి అడ్డదారి సంపాదనకు ఎగబడుతున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు. అయితే కొంతకాలంగా అక్రమ నిర్మాణాలపై వరుస ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
33 భవనాలకు నోటీసులు..
మున్సిపల్ పరిధిలో చేపడుతున్న భవన నిర్మాణాలపై మాయలేడి పేరిట ఇప్పటి వరకు 133 ఫిర్యాదులు రాగా అధికారులు పరిశీలించి 33 భవనాలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేరుగా ఫిర్యాదు చేసి నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోని అధికారులు అపరిచిత వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద నోటీసులు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో కొన్నింటికి మాత్రమే నోటీసులు ఇచ్చి మిగతా వాటిని వదిలేయడంపై అనుమానాలు వస్తున్నాయి. కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులను వదిలేసి సామాన్య మధ్య తరగతి వారికే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చి నెల రోజులకు పైగా గడిచిపోతున్నా ఎలాంటి చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 33 నోటీసులకు ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. అయినా అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారనే ఆరోపణలున్నాయి. అనుమతులు తీసుకున్న అన్ని చోట్ల కొ న్ని లొసుగులు ఉండడం సాధారణమే కావడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నట్లు తెలు స్తోంది. నోటీసులు తీసుకున్న కొందరు ఇంటి యజమానులు ఇప్పటికే మున్సిపల్ అధికారులను సంప్రదించి మాయలే డిపై ఎవరని ఆరా తీసినా సరైన సమాధానం రాలేదంటున్నారు. అలాంటి మహిళ ఎవరూ లేరని, ఎవరో కావాలనే తమపై ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులే ఫిర్యాదులను సృష్టించి దరఖాస్తుదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదుల సూత్రదారి ఎవరు?
భవన నిర్మాణాలపై వస్తున్న వరుస ఫిర్యాదుల అసలు సూత్రదారి ఎవరన్నదే చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదులతో పాటు పేర్కొన్న సెల్ నెంబర్తో అపరిచిత వ్యక్తి చిరునామాను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఫిర్యాదు చేసిన ఫోన్ నెంబర్ను సంప్రదిస్తే సమాధానం రావడం లేదని ట్రూకాలర్లో మరో వ్యక్తి పేరు వస్తోందని అధికారులు చెబుతున్నారు. స్థానిక చిరునామా కాకుండా హైదరాబాద్ కూకట్పెల్లి అడ్రస్ పేర్కొనడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్థానికులే కావాలని తప్పుడు చిరునామాను పేర్కొంటూ ఎవరికీ అనుమానం రాకుండా దరఖాస్తు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్ చట్టప్రకారం ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరును బహిర్గతం చేసే అవకాశం లేకపోవడంతో అధికారులు ఫిర్యాదుదారుని పేరు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. రహస్యంగా వస్తున్న ఫిర్యాదులపై అధికారులు ఆరా తీస్తున్నారు. అక్రమాలపై నేరుగాకాకుండా అపరిచిత మహిళ ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు తర్జన భర్జన పడుతున్నారు. అధికారులను ముప్పతిప్పలు పెట్టేందుకే ఫిర్యాదులు చేస్తున్నారా లేక ఇంటి యజమానుల నుంచి ఏదైనా ఆశిస్తున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఫిర్యాదుల విషయం పోలీసుల వరకు చేరడంతో త్వరలోనే అసలు విషయం బయట పడే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి అపరిచిత ఫిర్యాదులతో మున్సిపల్ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఫిర్యాదులన్నింటికీ సమాధానం ఇవ్వకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే..
- శైలజ (మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్)
గత కొద్ది రోజులుగా మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భవన నిర్మాణాలపై గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. ఇప్పటికే కొంత మంది ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటాం. అలాగే టీఎస్ బిపాస్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. ఫిర్యాదుదారులు ఎవరన్నది తెలియడం లేదు. ఓ పేరుతో అపరిచిత వ్యక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 133 ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించాం. ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లు అక్రమాలు జరిగినట్లు రుజువైతే వెంటనే చర్యలు తీసుకుంటాం.