ఆశా వర్కర్ల సమస్యలు తీరేదెప్పుడు?
ABN , First Publish Date - 2022-12-06T22:09:09+05:30 IST
జిల్లాలో ఆశా వర్కర్లు సమస్యల తో సతమతమవుతున్నారు. నెలల తరబడి పెండింగ్లో వేతనాలు ఉన్నా ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరి ట వీరికి అనేక పనులు అప్పగిస్తున్నారని వాపోతున్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 6: జిల్లాలో ఆశా వర్కర్లు సమస్యల తో సతమతమవుతున్నారు. నెలల తరబడి పెండింగ్లో వేతనాలు ఉన్నా ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరి ట వీరికి అనేక పనులు అప్పగిస్తున్నారని వాపోతున్నారు. ప్రతీ పీహెచ్సీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి నార్మల్ డెలివరీ కోసం గర్భిణులను తరలించే డ్యూటీ ఆశాలదే. నెలలో 2 నుంచి 4 డెలివరీలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించాలి. లేదంటే ఆ నెలలో వేతనాలను నిలిపివేస్తున్నారని వారం టున్నారు. వీరిపై ఏఎన్ఎంలు, అధికారులు అజమాయిషీ చెలాయిస్తు న్నారని పేర్కొంటున్నారు. సంవత్సర కాలంగా కంటి వెలుగు, సీజనల్ వ్యాధుల సర్వేకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆశా వర్కర్లు మాత్రమే పని చేస్తుండగా ఏఎన్ఎంలు, అధికారులు అందుబాటులో ఉండడం లేదు. జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్ భవనం అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణులను తర లిస్తున్నారు. ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యాలు, టీఏ డీఏలు చెల్లించకుండా పని భారం మోపడంతో మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మే 2021 నుంచి ఇప్పటి వరకు ఎండిఎ, లెప్రసీ, పీఆర్సీ, తదితర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కొవిడ్ సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించారు. వీరి సేవలను డబ్ల్యూహెచ్వో గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్గా, ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతన పెంపు విషయంలో ఇచ్చిన మాట విస్మరించాయని, శ్రమదోపిడి జరుగుతోందని ఆందోళనబాట పడుతున్నారు. నెల జీతం రూ.9750 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా వారికి అం దేది రూ.7వేల నుంచి రూ.8 వేల వరకే. లక్ష్యా లు పూర్తి చేయకపోతే వేతనం కట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సమ యానికి వేతనాలు అందకుండా ఒకసారి రూ. 2900, మిగతా వేతనం 3, 4 నెలల తర్వాత మరోసారి రావడంతో కుటుంబ పోషణ భారమవుతుం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలి
ఆశా వర్కర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. రెండో ఏఎన్ఎంలుగా గుర్తించాలని కోరుతూ ఉద్యమిస్తూ అవసరమైతే సమ్మెకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఐఎల్సీ ప్రకారం ఆశాలకు పొరుగు రాష్ట్రాల్లో లాగా ఫిక్డ్స్ వేతనాలను, టీఏ, డీఏలను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పారితోషికం బహుమతులు అవసరం లేదని, పనికి తగిన వేతనం ఇస్తే చాలని అం టున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని, సమస్యను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభత్వ పరంగా ఉచితంగా రావాల్సిన డ్రెస్ అలవెన్సు, సానిటేషన్, టీబీ స్పుటం డబ్బాలు ఆలస్యమైనా తాము సర్దుబాటు చేసుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు, ఏఎన్ ఎంలు అందుబాటులో లేకున్నా వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజా ఆరోగ్య వ్యవస్థలో తమది కీలక పాత్ర అని ఆశాలంటున్నారు. ప్రభు త్వం, వైద్యాధికారుల సూచనల మేరకు సీజనల్ వ్యాధుల సర్వేను చేపడు తున్నారు. ఇంటింటికి తిరుగుతూ వ్యాధుల నిర్ధారణకు రికార్డులను మెయింటేన్ చేస్తూ ఉన్నతాధికారులకు నివేదికలను పంపుతున్నారు.
అంకిత భావంతో పని చేస్తున్న తమపై ఉన్నతాధికారులు పని భారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ అంశంపై యూనియన్ నాయకుల అండతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నా అధికారుల తీరు మారడం లేదన్నారు.
సమయపాలన లేని డ్యూటీలు....
ఉదయం విధులకు హాజరైన ఆశా వర్కర్లు డ్యూటీలో భాగంగా ఎక్కడికి వెళ్లేది ఆ రోజు మాత్రమే తెలుస్తుంది. తమకు సమయ పాలన లేని డ్యూటీలు వేయడం వల్ల పని భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రత్యామ్నాయంగా ఇతర సిబ్బందికి కూడా కేటాయిం చాలంటున్నారు.
పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలి
ఆశా వర్కర్ల పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఆ సంఘం అనుబంధ సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సమ్మక్క, శోభలు అన్నారు. మంగళవారం ఆశా వర్కర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరానికి సంబంధించిన లెప్రసీ, టీబీ, సర్వేల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తేనే లెప్రసీ సర్వేను కొనసాగిస్తామన్నారు. జనవరిలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమానికి హాజరు కాకుండా సమ్మె చేస్తామన్నారు. అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను చెల్లించి జాబ్ చార్టును ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఎఫ్, ఈఎస్ఐలను వర్తింపజేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్, ఉపాధ్యక్షురాలు సునీత, విజయలక్ష్మి, పద్మ, రాజేశ్వరి, సత్యవతి, వసంత, వణిత, రాజమణి, భాగ్యలక్ష్మి, నర్మద పాల్గొన్నారు.