రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ABN , First Publish Date - 2022-03-19T04:21:58+05:30 IST
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీఎం కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన బొద్దున నరేష్(28), ఇందారం గ్రామానికి చెందిన తొగిటి ప్రసాద్(30)లు నరేష్ మోటార్ సైకిల్పై స్వగ్రామాలకు వెళుతుండగా గోదావరిఖని నుంచి మంచిర్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొంది.
పండుగ వేళ ఇరు కుటుంబాల్లో విషాదం
నస్పూర్, మార్చి 18 : శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీఎం కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన బొద్దున నరేష్(28), ఇందారం గ్రామానికి చెందిన తొగిటి ప్రసాద్(30)లు నరేష్ మోటార్ సైకిల్పై స్వగ్రామాలకు వెళుతుండగా గోదావరిఖని నుంచి మంచిర్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొంది. బొద్దున నరేష్ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టులో కాంట్రాక్టు కార్మికుడిగా, తొగిటి ప్రసాద్ మంచిర్యాల పట్టణంలోని ఓ జ్యూవెల్లరీ షాపులో వర్కర్గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ వివాహాలు కాలేదు. నరేష్ తండ్రి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కాగా ప్రసాద్ తండ్రి చాలా ఏళ్ళ క్రితమే మృతి చెందాడు. సామాన్య కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హోలీ పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై మానసలు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మానస తెలిపారు.