విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , First Publish Date - 2022-09-10T07:34:47+05:30 IST
ఈ నెల 5వ తేదీ నుండి 11 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో భాగంగా మామడ మండలం మినీ గురుకుల విద్యాలయాన్ని శుక్రవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
మామడ, సెప్టెంబరు 9 : ఈ నెల 5వ తేదీ నుండి 11 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో భాగంగా మామడ మండలం మినీ గురుకుల విద్యాలయాన్ని శుక్రవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ... విద్యార్థులు స్వచ్ఛందంగా తమ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకోవాలని సూచించారు. వంట గదిని పరిశీలించి ఎప్పటికప్పుడు వంట గదిని శుభ్రం చేయాలని, నాణ్యమైన సరుకులను వినియోగించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ విద్యార్థులకు అవసరమైన మందులు అందజేయాలన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వలన విద్యార్థుల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వచ్ఛ గురుకుల కార్యక్రమం కొనసాగుతున్నందున ఎప్పటికప్పుడు గురుకుల పరిశుభ్రతపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఎంపీడీవో మల్లేశం, సూపరిండెంట్ ఉపేందర్, తదితరులున్నారు.