శ్రీరామనవమి సందర్భంగా భైంసాలో పోలీసు కవాతు
ABN , First Publish Date - 2022-04-10T06:58:14+05:30 IST
శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం భైంసాలో నిర్వహించే శోభాయాత్రకు పోలీస్శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతోంది.
భైంసా క్రైం, ఏప్రిల్ 9 : శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం భైంసాలో నిర్వహించే శోభాయాత్రకు పోలీస్శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతోంది. ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా శనివారం ఉదయం పట్టణంలో పోలీస్శాఖ కవాతు చేపట్టింది. ఏఎస్పీ కిరణ్ఖారే నేతృత్వంలో భైంసా టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో పోలీస్ శాఖ పట్టణంలోనీ ప్రధాన వీధుల మీదుగా కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ ఖారే పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆదివారం జరిగే శోభాయాత్రలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు గానూ పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. బందోబస్తులో పాల్గొనే సిబ్బంది శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు అప్రమత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు.