Mancherial: అందుకే వరవరరావు, సాయిబాబా లాంటి వారిని జైల్లో పెట్టారు: నారాయణ
ABN , First Publish Date - 2022-07-24T21:31:26+05:30 IST
ప్రధాని మోదీ దేశంలో ఏకచక్రాధిపత్యంగా ఎదగాలని చూస్తున్నారని నారాయణ ఆరోపించారు.
మంచిర్యాల (Mancherial): ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశంలో ఏకచక్రాధిపత్యంగా ఎదగాలని చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) ఆరోపించారు. మంచిర్యాలలో జరుగుతున్న సీపీఐ జిల్లా మహాసభకు హాజరైన ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు (Communists) బలంగా ఉంటే దేశాన్ని అమ్ముకోనివ్వరని కక్షగట్టి వరవరరావు (varavararao, సాయిబాబా (saibaba) లాంటి వారిని జైల్లో పెట్టారని విమర్శించారు. ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము (Daupathi Murmu)ను రాష్ట్రపతిని చేయడం కాదని, గిరిజనుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసే ఒకే ఒక్క పార్టీ సీపీఐ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI)ని ఉపయోగించుకుంటోందని విమర్శించారు. బీజేపీ (BJP) పాలనలోనే బ్లాక్ మనీ (Black money)ని కొందరు వ్యక్తులు వైట్ మనీ(White money)గా మార్చుకున్నారన్నారు. 24 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను ఇప్పటికే అమ్మేశారని, మరో వంద పబ్లిక్ కంపెనీలను అమ్మేందుకు సిద్ధమయ్యారన్నారు. దేశ సంపదలను అప్పుల రూపంలో తీసుకొని 89 మంది ఎగ్గొట్టారని, అందులో 29 మంది గుజరాత్ (Gujarath) వాళ్లే ఉండడం మోదీ పరిపాలనకు నిదర్శనమన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం త్వరితగతిన ఇవ్వాలని, లేదంటే సీపీఐ పోరాటం కొనసాగుతుందని నారాయణ స్పష్టం చేశారు.