వైభవోపేతంగా శ్రీనివాస కల్యాణం
ABN , First Publish Date - 2022-03-16T07:21:49+05:30 IST
పట్టణంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలలో బాగంగా పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ మహోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.
భారీగా తరలివచ్చిన భక్తజనం
భైంసా, మార్చి 15: పట్టణంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలలో బాగంగా పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ మహోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు భూదేవీ, పద్మావతీ సమేత శ్రీనివాసస్వామి ఉత్సవమూర్తులకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల కోలాహలం మధ్య కల్యాణో త్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎదుర్కోలు ముగిసిన అనంతరం శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులకు కల్యాణవేదిక వద్దకు శోభాయాత్రగా తీసుకవచ్చారు. శ్రీనివాసుడిని అశ్వవాహనంపై, అమ్మవార్లను పల్లకిలో కల్యాణవేదిక వద్దకు భాజాభజంత్రీలతో తీసుకువచ్చారు. కల్యాణ వే డుకలను నిర్వహించే దంపతులు తమ తలలపై తలంబ్రాలు, పట్టువస్త్రాలతో మంగళహారతులతో ముందు నడువగా వెనుకభాగంలో ఉత్సవమూర్తులను శోభాయాత్రగా కల్యాణవేదిక వద్దకు తీసుకవచ్చారు. అనంతరం వేద పండితులు చక్రవర్తుల సుదర్శనాచారి చేతుల మీదుగా కల్యాణోత్సవ వేడుకలు కమనీయంగా కొనసాగాయి. రెండున్నర గంటల శాస్త్రోక్తంగా, మంత్రోచ్చారణల మధ్య శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహణ కమిటీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది. వేడుకలకు పట్టణ భక్తులే కాకుండా సమీప గ్రామాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు