బాసరలో భక్తజన కోలాహలం
ABN , First Publish Date - 2022-10-03T05:29:19+05:30 IST
చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన బాసరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రి మహోత్సవాలతోపాటు అమ్మవారి ప్రధానమైన మూల నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతోపాటు మహా రాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మూల నక్షత్రం వేళ భారీగా తరలివచ్చిన భక్తులు
అధిక సంఖ్యలో అక్షర శ్రీకార పూజలు
బాసర, అక్టోబరు 2: చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన బాసరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రి మహోత్సవాలతోపాటు అమ్మవారి ప్రధానమైన మూల నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతోపాటు మహా రాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల 7వ రోజు సరస్వతి అమ్మవారు కాళరాత్రి రూపంలో దర్శనమి చ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం 4 గంట ల నుంచే అక్షర శ్రీకార పూజలను ప్రారంభించారు. ఉదయం 3 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సరస్వతి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పట్టువస్ర్తాలను సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులతో తలపై అమ్మవారి పట్టు వస్ర్తాలను, ఒడి బియ్యాన్ని భజా భజంత్రీల మధ్య అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావు, మండల ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్యామ్, ఉన్నారు.