బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ABN , First Publish Date - 2022-07-08T05:12:42+05:30 IST
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో బాలకార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్టౌన్, జూలై7: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో బాలకార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్ -8లో భాగంగా జూలై 1 నుంచి 31 వరకు బడీడు పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు, కార్మిక, పంచాయతీ, విద్య, వైద్య, సంక్షేమ శాఖలు, బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల కార్మికులను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇటుక బట్టీలు, వ్యాపార సముదాయాలు, ఇతరాత్ర పని ప్రదేశాలలో తప్పి పోయిన పిల్లలను,బాల కార్మికులను గుర్తించి సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందించి బాల సదనంకు తరలించాలన్నారు. గత ఆపరేషన్ స్మైల్లో జిల్లాలో ఇప్పటి వరకు 55 కేసులు నమోదు చేశామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి నెల నిర్దేశించిన సమయంలోగా బియ్యం, ఇతరాత్రి సరుకులను నిర్దేశించిన గడువులోగా సరఫరా చేయాలని జిల్లా సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్క, కార్మిక శాఖ ఇన్చార్జి కమిషనర్ శ్రావణి, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, అధికారులు పాల్గొన్నారు.