ఆరోగ్యశ్రీ కేసుల్ని ప్రైవేట్‌కు రెఫర్‌ చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-18T08:07:21+05:30 IST

ఆరోగ్యశ్రీ కేసులను ప్రైవేటుకు రెఫర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వైద్యులను హెచ్చరించారు.

ఆరోగ్యశ్రీ కేసుల్ని ప్రైవేట్‌కు రెఫర్‌ చేస్తే చర్యలు

వైద్యులకు డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి హెచ్చరిక 

సంగారెడ్డి అర్బన్‌, మే 17: ఆరోగ్యశ్రీ కేసులను ప్రైవేటుకు రెఫర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వైద్యులను హెచ్చరించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)ని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తొలుత ఆరోగ్యశ్రీ గదిలో రికార్డులు పరిశీలించిన ఆయన ప్రతీ ఆర్థో కేసును ఆరోగ్యశ్రీలో నమోదు చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ అమలవుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా ఉంచామని, ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్య శ్రీ కేసులు ప్రైవేటుకు పంపినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర విభాగం వద్ద ఆరోగ్య శ్రీ క్యాబిన్‌, సిబ్బంది కనిపించేలా టేబుల్‌ ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల సర్జరీలు పెంచాలని సూచించారు. సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల స్థాయిలో వసతులు, సౌకర్యాలు, డాక్టర్లను నియమించిన నేపథ్యంలో ఒక్క కేసు కూడా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాకు రెఫర్‌ చేయవద్దన్నారు.   

Updated Date - 2022-05-18T08:07:21+05:30 IST