jubille hills gang rape case: జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసులో కీలక మలుపు
ABN , First Publish Date - 2022-10-01T00:00:46+05:30 IST
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసులో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా జువైనల్ కోర్టు గుర్తించింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా జువైనల్ కోర్టు గుర్తించింది. ఎమ్మెల్యే కుమారుడిని జువైనల్గా విచారించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. పబ్కు వచ్చిన బాలికను ట్రాప్ చేసి గ్యాంగ్రేప్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్కు వచ్చిన రొమేనియా మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. నిందితుల్లో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారులున్నారు. ఈ కేసులో నిందితులకు జువెనైల్ కోర్ట్ (Juvenile court) బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణిస్తే.. వారికి శిక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయని పోలీసులు భావించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు మైనర్లుగా ఉన్నప్పటికీ... చేసిన నేరం మాత్రం మైనర్ స్థాయి కానందున వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
తొలుత ఇద్దరు మేజర్లని చెప్పి..
అత్యాచార ఘటనలో పాల్గొన్న ఐదుగురిలో ఇద్దరు మేజర్లు.. ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తొలుత ప్రకటించారు. కానీ మేజర్లుగా ఉన్న ఇద్దరిలో ఒకరికి 18 ఏళ్లు నిండటానికి మరో నెల రోజులు మిగిలి ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు అతన్ని కూడా మైనర్గానే పరిగణించారు. నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఓ టీఆర్ఎస్ నేత కుమారుడు కాగా.. ఇద్దరు మైనర్లు కూడా టీఆర్ఎస్ నేతల కుమారులని తెలిసింది. మరొకరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు, ఇంకొకరు సంగారెడ్డి కార్పొరేటర్ కుమారుడు.. వీరితో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కుమారుడిని మైనర్గా నిర్ధారించారు.