వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే
ABN , First Publish Date - 2022-07-05T10:06:11+05:30 IST
వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
- అల్లూరి జయంతి, వర్ధంతులను
- సర్కారు అధికారికంగా నిర్వహిస్తోంది
- త్వరలోనే 3 ఎకరాల్లో క్షత్రియ భవనం
- దానికి అల్లూరి సీతారామరాజు పేరు
- పెట్టడమే సముచితం: మంత్రి కేటీఆర్
కవాడిగూడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా సోమవారం ట్యాంక్బండ్పై ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటీష్ పాలకులతో పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. క్షత్రియుల కులస్తులు స్థలం అడగ్గానే సీఎం కేసీఆర్ మూడు ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు. త్వరలోనే క్షత్రియ భవనం పూర్తి కానుందని, దానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని అన్నారు. మంత్రి శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ గిరిజనుల పక్షాన పోరాడిన వీరుడు అల్లూరి అని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే వైతాళికులను గౌరవించుకోవడం మొదలైందని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు వర్మ, శ్యామలరాజు, మైనర్ రాజు, రామరాజు, వరదరాజులు, అప్గన్ రామరాజు పాల్గొన్నారు.