స్వర్ణ జ్యోతి.. రజత నందిని

ABN , First Publish Date - 2022-10-05T09:17:01+05:30 IST

లుగమ్మాయిలు యర్రాజి జ్యోతి, అగసర నందిని మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకాలు కొల్లగొట్టి తెలుగు రాష్ట్రాలకు దసరా కానుకిచ్చారు.

స్వర్ణ జ్యోతి.. రజత నందిని

హర్డిల్స్‌లో సత్తా చాటిన తెలుగు క్రీడాకారులు

 జావెలిన్‌లో రష్మికి ద్వితీయ స్థానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగమ్మాయిలు యర్రాజి జ్యోతి, అగసర నందిని మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకాలు కొల్లగొట్టి తెలుగు రాష్ట్రాలకు దసరా కానుకిచ్చారు. గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు రెండు, తెలంగాణకు ఒక పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖపట్నం యువ అథ్లెట్‌ యర్రాజి జ్యోతి 12.74 సెకన్లలో రేసును ముగించి పసిడి పతకం అందుకుంది. ఈ క్రీడల్లో జ్యోతికి ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు మహిళల 100 మీటర్ల స్ర్పింట్‌లో జ్యోతి బంగారు పతకం నెగ్గడం తెలిసిందే.


ఇక, మహిళల 100 మీ., హర్డిల్స్‌లోనే మరో తెలుగమ్మాయి.. హైదరాబాద్‌కు చెందిన అగసర నందిని రజత పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థిని అయిన నందిని 13.38 సెకన్లలో రేసు పూర్తి చేసి జాతీయ క్రీడల్లో రాష్ట్రానికి అథ్లెటిక్స్‌లో పతకం అందించింది. మహిళల జావెలిన్‌ త్రోలో విజయవాడ అమ్మాయి రష్మి రజతంతో మెరిసింది. రష్మి జావెలిన్‌ను 53.95 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలవగా అన్నూరాణి (ఉత్తరప్రదేశ్‌) స్వర్ణం, శిల్పారాణి (హరియాణా) కాంస్యం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో తెలంగాణ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ 22-20, 21-13తో సతీ్‌షకుమార్‌ (తమిళనాడు)పై నెగ్గి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. మహిళల 5-5 బాస్కెట్‌బాల్‌ క్వార్టర్స్‌లో తెలంగాణ 98-48తో అసోంపై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 

Updated Date - 2022-10-05T09:17:01+05:30 IST