అమ్మాయిల హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2022-10-05T09:18:55+05:30 IST

జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 11 ఫోర్లతో 75 నాటౌట్‌) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో.. ఆసియాక్‌పలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

అమ్మాయిల హ్యాట్రిక్‌

 జెమీమా, దీప్తి హాఫ్‌ సెంచరీలు

104 రన్స్‌తో యూఏఈ చిత్తు

మహిళల  ఆసియా కప్‌

సిల్హట్‌: జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 11 ఫోర్లతో 75 నాటౌట్‌) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో.. ఆసియాక్‌పలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 104 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ రిచా ఘోష్‌ (0) డకౌట్‌ కాగా.. గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన మేఘన (10), హేమలత (2) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌ 20/3తో కష్టాల్లో పడింది.


అయితే, దీప్తి శర్మ (49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64)-రోడ్రిగ్స్‌ నాలుగో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యంతో సవాల్‌ విసరగలిగే స్కోరును అందించారు. అనంతరం ఛేదనలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. యూఏఈ ఓవర్లన్నీ ఆడి 74/4 స్కోరుకే పరిమితమైంది. కవిష (30 నాటౌట్‌), ఖుషీ శర్మ (29) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రాజేశ్వరీ గైక్వాడ్‌ రెండు వికెట్లు పడగొట్టింది. మూడు మ్యాచ్‌ల నుంచి మొత్తం 6 పాయింట్లతో టాప్‌లో నిలిచిన టీమిండియా.. సెమీస్‌ అవకాశాలను మరింతగా మెరుగుపరచుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాక్‌తో భారత్‌ తలపడనుంది. 


సంక్షిప్త స్కోర్లు:

భారత్‌:

20 ఓవర్లలో 178/5 (జెమీమా 75 నాటౌట్‌, దీప్తి 64; మహిక 1/27); యూఏఈ: 20 ఓవర్లలో 74/4 (కవిష 30 నాటౌట్‌, ఖుషీ శర్మ 29; రాజేశ్వరి 2/20). 

Updated Date - 2022-10-05T09:18:55+05:30 IST