Team India: ఓటమి భారంతో ఉన్న టీమిండియాకు మరో షాక్.. రూ. 52.8 లక్షల లాస్!
ABN , First Publish Date - 2022-12-05T21:30:47+05:30 IST
ఈ లెక్కన భారత్ తమ మ్యాచ్ ఫీజులో మొత్తంగా రూ. 52.8 లక్షలు కోల్పోనుంది. తప్పును రోహిత్ శర్మ అంగీకరించడంతో ఈ విషయంలో ఇక తదుపరి విచారణ ఉండదని ఐసీసీ తెలిపింది.
ఢాకా: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన మ్యాచ్లో ఓడిన టీమిండియా (Team India)కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత పడింది. నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైన జట్టు మొత్తంగా నాలుగు ఓవర్లు వెనకబడింది. దీంతో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రంజన్ ముదుగులే భారత జట్టుకు జరిమానా విధించారు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం మినిమమ్ ఓవర్ తప్పిదానికి సంబంధించి ఆటగాళ్లు, సహాయక సిబ్బందిపై జరిమానా విధిస్తారు. ఒక్కో ఓవర్కు 20 శాతం చొప్పున నిర్ణీత సమయంలోపు ఎన్ని ఓవర్లు మిగిలిపోతే అన్ని ఓవర్లకు ఫైన్ విధిస్తారు. ఈ లెక్కన భారత్ తమ మ్యాచ్ ఫీజులో మొత్తంగా రూ. 52.8 లక్షలు కోల్పోనుంది. తప్పును రోహిత్ శర్మ అంగీకరించడంతో ఈ విషయంలో ఇక తదుపరి విచారణ ఉండదని ఐసీసీ తెలిపింది.