Saudi Arabia: సోషల్ మీడియా పోస్టులపై కన్నెర్ర.. సౌదీ మహిళకు 45 ఏళ్ల జైలు శిక్ష..
ABN , First Publish Date - 2022-08-31T21:32:27+05:30 IST
సోషల్ మీడియా పోస్ట్ల కారణంగా సౌదీ అరేబియా (Saudi Arabia)కు చెందిన ఓ మహిళ భారీ శిక్షకు గురైంది.
సోషల్ మీడియా పోస్ట్ల కారణంగా సౌదీ అరేబియా (Saudi Arabia)కు చెందిన ఓ మహిళ భారీ శిక్షకు గురైంది. సౌదీ కోర్టు ఆమెకు ఏకంగా 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వారాల వ్యవధిలో ఇది రెండోది కావడం గమనార్హం. సామాజిక వ్యవస్థను కించపరిచేందుకు ఇంటర్నెట్ను ఉపయోగించిందనే కారణంతో 34 ఏళ్ల నౌరా బిన్ సయీద్ అల్-ఖహ్తానీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను యాంటీ టెర్రరిజం కోర్టులో హాజరుపరిచారు. తీవ్రవాద వ్యతిరేక, సైబర్ క్రైమ్ వ్యతిరేక చట్టం కింద నౌరాను దోషిగా కోర్టు నిర్ధారించినట్టు డెమోక్రసీ ఫర్ అరబ్ వరల్డ్ నౌ (DAWN) తెలిపింది.
ఇది కూడా చదవండి..
Shocking: ఇలాంటి వ్యాధి ఎవరికీ ఉండదేమో.. ఆమె రోజులో 23 గంటలు మంచం పైనే.. కిందకు దిగితే ఆమె పరిస్థితి ఏంటంటే..
ట్విటర్లో తన అభిప్రాయాలను వెల్లడించినందుకే ఆమెకు ఈ శిక్ష విధించినట్లు సమాచారం. నౌరాకు విధించిన శిక్షను అనేక మానవ హక్కుల సంస్థలు(Human Rights) వ్యతిరేకించాయి. కొన్ని వారాల క్రితం, లీడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న పీహెచ్డీ విద్యార్థి, ఇద్దరు పిల్లల తల్లి అయిన 34 ఏళ్ల సల్మా అల్ షబాబ్కు కూడా సోషల్ మీడియా పోస్టుల వల్లే సౌదీ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సెలవుల కోసం ఇంగ్లండ్ నుంచి సౌదీ అరేబియా వెళ్లినపుడు ఆమెను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పౌర జాతీయ భధ్రత నిబంధనలకు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు సంబంధించిన ట్విటర్ ఖాతాలను ఫాలో చేయడమేకాకుండా వారి పోస్టులను కూడా సల్మా రీట్వీట్లు చేసినట్లు భద్రతా దళం గుర్తించింది. సౌదీ స్పెషల్ టెర్రరిస్ట్ కోర్టు ఆమెకు గత ఏడాది జనవరి 15న మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆమె ప్రాసిక్యూటర్ కోర్టుకు అప్పీల్ చేయగా, ఆమెపై ఆరోపించిన నేరాలు తీవ్రమైనవిగా పరిగణిస్తూ 34 యేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.