Romania: భార్య కోరిందని ఇండియాలో విదేశీయుడి పర్యటన.. ఇక్కడివారి ఆతిథ్యం చూసి..
ABN , First Publish Date - 2022-11-28T21:40:45+05:30 IST
రొమేనియాకు చెందిన పీటర్ తన భార్య వోల్గాన్తో కలిసి కొన్ని నెలల క్రితం ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా భారత్కు వచ్చిన ఆ దంపతులు ఇక్కడి వారి ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయారు.
కొత్తపల్లి: రొమేనియాకు(Romania) చెందిన పీటర్ తన భార్య వోల్గాన్తో కలిసి కొన్ని నెలల క్రితం ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారత్కు వచ్చిన ఆ దంపతులు ఇక్కడి వారి ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయారు. పీటర్ సతీమణికి ఇండియాలో పర్యటించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. వారు తమ ప్రయాణం ప్రారంభించేందుకు సమాయత్తం అవుతుండగా ఆ జంటకు(Romania Couple) ఓ పాప పుట్టింది. దీంతో.. చిన్నారిని స్కూల్లో చేర్పించే నాటికి ప్రపంచం అంతా చుట్టివచ్దేద్దామని పీటర్ దంపతులు నిర్ణయించుకున్నారు. రొమేనియా (Romania) నుంచి వ్యాన్పై తమ ప్రయాణం ప్రారంభించారు.
తొలుత ఇటలీ నుంచి, ఇరాన్, పాకిస్థాన్ మీదుగా గోవా చేరుకున్నారు. అక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆదివారం సాయంత్రం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం చేరుకున్నారు. వీరికి యండపల్లి జంక్షన్లో ఉన్న చెలికాని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకుడు జగదీష్ రాత్రికి బసచేసేందుకు సాయం చేశారు. భారతదేశంలో సంస్కృతి, సంప్రదాయాల పట్ల తామెంతో ఆకర్షితులయ్యామని, విదేశీయుల పట్ల భారతీయులు చూపించే ప్రేమాభిమానాలు మరువలేనివని పీటర్ దంపతులు చెప్పారు. సోమవారం ఉదయం బయలు దేరి కోల్కతా, అమృతసర్, ఆపై నేపాల్లో పర్యటించిన అనంతరం రొమేనియాకు తిరిగెళతామని పీటర్ తెలిపారు.