అయోధ్య రామాలయ నిర్మాణ పనులు ఎంతవరకూ వచ్చాయంటే...
ABN , First Publish Date - 2022-08-06T14:27:13+05:30 IST
2020 ఆగస్టులో అంటే సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి...
2020 ఆగస్టులో అంటే సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో నిర్మించబోయే రామాలయానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్మాణ పనులు ఎంతవరకూ వచ్చాయో తెలుసుకుందాం.
ఆలయ నిర్మాణంలో మూడు వంతుల ఫ్లించ్ పనులు పూర్తయ్యాయి. ట్రస్టు పేర్కొన్న వివరాల ప్రకారం సెప్టెంబర్లో పూర్తి కావాల్సిన పనులు ఆగస్టు నెలలోనే పూర్తయ్యాయి. గర్భగుడి పనులు 23 డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు.
గర్భగుడి నిర్మాణం తర్వాత శ్రీరాముని దర్శనం డిసెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుందని చెబుతున్నారు. రాళ్ల సరఫరా పనులు దాదాపు పూర్తికాగా, ఆలయ నిర్మాణంలోని నాలుగు దశలు పూర్తయ్యాయి. ఇందులో ఐదో లేయర్, కొన్ని చోట్ల ఆరో లేయర్ పనులు జరుగుతున్నాయి అంటే దాదాపు 90 శాతం ఫ్లించ్ పనులు పూర్తయ్యాయి. ట్రస్ట్ తదుపరి లక్ష్యం రెండవ అంతస్తు నిర్మాణ పని.
రాముని గర్భగుడిని పాలరాతితో నిర్మిస్తున్నారు. ఆలయంతో పాటు ఘాట్ల రూపురేఖలు కూడా మారుతున్నాయి.
ఆలయానికి వెళ్లే దారిలో 12 అడుగుల మార్గం ఉంటుంది. దీనికి పైన షెడ్ వేశారు. ఫలితంగా ఈ మార్గంలో వచ్చే భక్తులకు వర్షాకాలం, వేసవిలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. భక్తులకు ప్రదక్షిణలు చేసుకునేందుకు అవకాశం కూడా కలుగుతుంది. అయోధ్య రైల్వే స్టేషన్కు అద్భుతమైన హంగులు సమకూరుస్తున్నారు.