విదేశీ అతిథులొచ్చాయోచ్...!

ABN , First Publish Date - 2022-10-11T14:31:44+05:30 IST

వలస పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేలపట్టు పక్షుల కేంద్రానికి విదేశీ పక్షులు విచ్చేశాయి. తిరుపతి జిల్లా దొరవారిసత్రం

విదేశీ అతిథులొచ్చాయోచ్...!

                    - నేలపట్టు కేంద్రంగా చక్కర్లు కొడుతున్న వీదేశీ పక్షులు


దొరవారిసత్రం(చెన్నై), అక్టోబరు 10: వలస పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేలపట్టు పక్షుల కేంద్రానికి విదేశీ పక్షులు విచ్చేశాయి. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల కేంద్రానికి యేటా అక్టోబరు మాసంలో వచ్చే విహంగాలు వారం రోజులనుంచి వస్తున్నాయి. పది రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురవడంతో నేలపట్టు పక్షుల కేంద్రంలోని మంచినీటి చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఆ చెరువుల్లోని  కడప చెట్లపై తెల్లని పూలవలే విడిది చేసేందుకు విదేశీ పక్షులు విచ్చేశాయి. నైజీరియా(Nigeria) ప్రాంతం నుంచి మొదటగా వచ్చే ఒపన్‌ బిల్డ్‌ స్టార్క్స్‌(నత్తగుల్లగొంగలు) 356 విచ్చేశాయి. వైట్‌ఐబీస్(తెల్లకంకణాయి) రకం పక్షులు 74, కార్మోరెంట్స్‌(నీటికాకులు) 37 వరకు వచ్చినట్లు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రత్యేకత కలిగిన పెలికాన్‌(గూడబాతు) పక్షులు మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. రెండు రోజుల క్రితం వీటి పైలట్‌ పక్షులు చక్కర్లు కొట్టి వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రకం పక్షులు కూడా ఈ వారంలో విచ్చేసే అవకాశాలు ఉన్నవి. మరో వారానికి నేలపట్టుకు వేల సంఖ్యలో విదేశీ పక్షులు విచ్చేసే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-10-11T14:31:44+05:30 IST