Karnataka: అప్పుడే పుట్టిన ఈ బాబుకు ఎంత కష్టమొచ్చింది.. 30 అడుగుల లోతు బావిలో..

ABN , First Publish Date - 2022-09-17T14:55:44+05:30 IST

చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం విని.. అటువైపుగా వెళ్తున్న గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడుపు శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి చుట్టు పక్కలంతా గాలించారు. చివరికి.. 30 అడుగల బావి నుంచి ఏడుపు శబ్దం వస్తుందని గ్రహించారు

Karnataka: అప్పుడే పుట్టిన ఈ బాబుకు ఎంత కష్టమొచ్చింది.. 30 అడుగుల లోతు బావిలో..

ఇంటర్నెట్ డెస్క్: చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం విని.. అటువైపుగా వెళ్తున్న గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడుపు శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి చుట్టు పక్కలంతా గాలించారు. చివరికి.. 30 అడుగల బావి నుంచి ఏడుపు శబ్దం వస్తుందని గ్రహించారు. వెంటనే అక్కడకు వెళ్లి.. బావిలోకి తొంగి చూశారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కర్నాటక(Karnataka)లోని మంద్యా(Mandya)లో దారుణం చోటు చేసుకుంది. మంద్యాలోని చంద్రే గ్రామానికి చెందిన కొందరు ప్రజలు.. శుక్రవారం ఓ పని మీద బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారికి చిన్నారి ఏడుపు శబ్దం వినిపించింది. ఎవరో చంటి బిడ్డ పాల కోసం ఏడుస్తుండొచ్చు అని తొలుత వాళ్లు భావించారు. ఎంతకూ చిన్నారి ఏడుపు ఆపకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారి కోసం గాలించారు. ఈ నేపథ్యంలోనే ఊరి దగ్గర్లోని బావి నుంచి శబ్దాలు వస్తున్నట్టు గ్రహించి.. అక్కడకు వెళ్లి చూశారు. బావిలో కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. సుమారు 30 అడుగుల లోతు బావిలో ప్లాస్టిక్ సంచిలో నవజాత శిశువు(Newborn)ను గుర్తించి.. కంగుతిన్నారు.


వెంటనే విషయాన్ని ఇతర గ్రామ ప్రజలకూ చెప్పి, తాడు సహాయంతో ఆ చిన్నారిని పైకి తీసుకొచ్చారు. అప్పుడే పుట్టిన బాబును గుర్తు తెలియని వ్యక్తులు బావిలో విడిచి వెళ్లినట్టు భావించాన స్థానికులు.. ఆ శిశువు వెనక భాగంలో గాయాలను చూసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని(primary health care)కి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం శిశువు మంద్యాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ నవజాత శిశువు ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. శిశువును బావిలో వదిలి వెళ్లింది ఎవరనే విషయం తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-09-17T14:55:44+05:30 IST