డబ్బులు కావాలని అడిగిన కోడలిపై అత్త దారుణం.. కోడలితో పాటు, మనవడిపై కూడా పెట్రోల్ పోసి సజీవం దహనం.. చివరకు..
ABN , First Publish Date - 2022-09-30T21:52:11+05:30 IST
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. తన ఇంటి కోడలు, రెండు నెలల వయసున్న మనవడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. తన ఇంటి కోడలు, రెండు నెలల వయసున్న మనవడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.. ఇద్దరూ తీవ్రంగా కాలిపోయారు.. స్థానికులు వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.. ఇంటి ఖర్చుల కోసం డబ్బులు అడిగిందనే కారణంతో కోడలిపై అత్త ఇంతటి ఘాతుకానికి పాల్పడింది.. తల్లి పక్కనే ఉన్న భర్త.. భార్యను, కొడుకును కాపాడే ప్రయత్నం చేయలేదు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..
14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీడియో ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి రూ.50 వేలు స్వాహా.. రూ.2.5 లక్షలు అడిగితే ఇవ్వలేదని..
గ్వాలియర్లోని సంతార్ ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడు రెండేళ్ల క్రితం కరిష్మా అనే ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కరిష్మాది ముస్లిం కుటుంబం కావడంతో శివ తల్లిదండ్రులు ఆమెను తమ ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శివ తన తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోనే అద్దె ఇల్లు తీసుకుని భార్యను అక్కడ ఉంచాడు. తను మాత్రమే తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేవాడు. రెండు నెలల క్రితం కరిష్మాకు మగబిడ్డ పుట్టాడు. అయినా కరిష్మా అత్తమామల మనసులు మారలేదు. శివ నిరుద్యోగి కావడంతో ఇంటిని పోషించడం కష్టంగా మారింది. గత నెల రోజులుగా అతను తల్లిదండ్రుల ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. దీంతో కరిష్మా డబ్బుల కోసం గురువారం సాయంత్రం అత్తింటికి వెళ్లింది.
ఖర్చులకి డబ్బులు అడిగినందుకు అత్త రజినీకి తీవ్ర కోపం వచ్చింది. కోడలిపై, రెండు నెలల మనవడిపై పెట్రోల్ పోసి నిప్పింటించింది. దీంతో కరిష్మా వెంటనే రోడ్డు పైకి పరిగెత్తింది. కొడుకును దూరంగా విసిరేసింది. ఆమె శరీరం 90 శాతం కాలిపోయింది. ఆ సమయంలో శివ కూడా అక్కడే ఉన్నాడు. స్థానికులు కరిష్మాను, ఆమె కొడుకును హాస్పిటల్లో చేర్పించారు. పోలీసులు భాదితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.