భార్యను వదిలి స్టాఫ్ నర్స్తో పారిపోయిన డాక్టర్.. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆస్థి కోసం గొడవ.. చివరకు..
ABN , First Publish Date - 2022-10-03T02:36:31+05:30 IST
హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన ఓ మహిళా వైద్యురాలు తన భర్త చేష్టలతో విసిగిపోయి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించింది.
హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన ఓ మహిళా వైద్యురాలు తన భర్త చేష్టలతో విసిగిపోయి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించింది. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భర్త తనను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడని, రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆస్థి కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నిందితుడిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..
Kerala: పిల్లి కరిచిందని హాస్పిటల్కు వెళ్లి కుక్క బారిన పడిన మహిళ.. చివరకు..
బాధిత మహిళకు 1998లో వివాహం జరిగింది. వివాహం అయి ఇద్దరు పిల్లలు పుట్టే వరకు భర్త ఆమెతో సఖ్యంగానే ఉన్నాడు. ఆ తర్వాత అతని రాసలీలలు ఒక్కొక్కటీ బయటపడ్డాయి. హాస్పిటల్లో పని చేసే నర్సులను అతను లైంగికంగా వేధించేవాడని, స్టాఫ్ నర్స్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బయటపడింది. అంతేకాకుండా ఆ స్టాఫ్ నర్స్తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయినట్టు బాధితురాలికి తెలిసింది. ఒక్కో విషయం బయటపడడంతో భర్తను బాధితురాలు నిలదీసింది. దీంతో 2017లో నిందితుడు పరారయ్యాడు. స్టాఫ్ నర్స్తో కలిసి వేరే ఊరు వెళ్లిపోయాడు.
బాధిత మహిళ హాస్పిటల్ చూసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. రెండేళ్ల తర్వాత నిందితుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆస్థి అంతా తనకు ఇచ్చెయ్యాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. అంతేకాదు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తీశాడని, అలాగే ఓ ఆస్థిని తనఖా పెట్టి డబ్బులు కూడా తీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. భర్త ఆగడాలు భరించలేక ఆమె చివరకు రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.