మత్తుగా ఊగుతున్న పక్షులు.. కారణమేంటో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-03-09T21:26:45+05:30 IST
డ్రగ్స్కు బానిసలైన మనుషులు మత్తులో పడి ఊగిపోతుండడం చూసి ఉంటారు.
డ్రగ్స్కు బానిసలైన మనుషులు మత్తులో పడి ఊగిపోతుండడం చూసి ఉంటారు. కానీ రాజస్థాన్లోని కొన్ని గ్రామాల్లో పక్షులు, ఆవులు కూడా అలాగే ఊగుతున్నాయి. దానికి కారణం అవి గసగసాల పొలాలలో మేత మేయడమే. గసగసాల మొక్కల కాండాల నుంచే నల్లమందు తయారవుతుందనే సంగతి తెలిసిందే. ఈ నల్లమందును కొన్ని రకాల ఔషధాల తయారీకి కూడా వినియోగిస్తుంటారు. అందుకే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. రాజస్థాన్లోని కొన్ని గ్రామాల్లోని రైతులకు గసగసాల పంట వేసేందుకు లైసెన్స్ ఇస్తుంటుంది.
రాజస్థాన్లోని భిల్వారా, చిత్తోర్గఢ్, ప్రతాప్గఢ్ మొదలైన ప్రాంతాలలో రైతులు ఈ పంటను సాగు చేస్తారు. అక్టోబర్ లేదా నవంబర్లో విత్తనాలు వేస్తే మార్చి చివరి నాటికి పంట చేతికి వస్తుంటుంది. అయితే వీరికి పక్షులు, ఆవుల రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ మొక్కలను తినేందుకు అన్ని రకాల పక్షులూ వస్తుంటాయి. కాండంలోని నల్లమందు పాలను పక్షులు తీసేస్తుండడం వల్ల పంట దిగుబడి సరిగ్గా రావడం లేదని వారు వాపోతున్నారు. నల్లమందుకు అలవాటు పడిన పక్షులు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగడం లేదు.
పంట పొలం చుట్టూ కంచెలు వేసి ఆవులను కట్టడి చేయగలుగుతున్న రైతులు పక్షులను మాత్రం ఆపలేకపోతున్నారు. పగటి పూట కాపలా కాసినా రాత్రి సమయాల్లో పక్షులు ఆ పంటపై దాడి చేస్తున్నాయి. దీంతో రైతులు పొలం మొత్తాన్ని వల వేసి కాపాడుకుంటున్నారు. అయినప్పటికీ పక్షుల దాడి కొనసాగుతూనే ఉంది. నల్లమందుకు బానిసలైన పక్షులు మత్తులో పడి తూలుతూ రైతులకు చిరాకు తెప్పిస్తున్నాయి.