Drunken Elephants: తప్ప తాగి అడవిలో నిద్రపోయిన ఏనుగులు.. వాటిని లేపడానికి అధికారుల పాట్లు..
ABN , First Publish Date - 2022-11-11T15:36:49+05:30 IST
మద్యం అనేది మనుషులకే కాదు.. జంతువులకు కూడా మంచి కిక్ ఇస్తుంది. ఒడిశాకు చెందిన కొన్ని ఏనుగులు మద్యం సేవించి అడవిలో మత్తుగా నిద్రపోయాయి.
మద్యం అనేది మనుషులకే కాదు.. జంతువులకు కూడా మంచి కిక్ ఇస్తుంది. ఒడిశాకు చెందిన కొన్ని ఏనుగులు మద్యం సేవించి అడవిలో మత్తుగా నిద్రపోయాయి. గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు వెంటనే అడవిలోకి వెళ్లి వాటిని లేపడానికి నానా తంటాలు పడ్డారు. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని శిలిపాడకు చెందిన కొందరు వ్యక్తులు సమీప అడవిలోని ఇప్ప పువ్వు సారాయి తయారు చేస్తుంటారు.
అందుకోసం అడవిలో పెద్ద పెద్ద కుండలను ఏర్పాటు చేసి ఇప్ప పువ్వులను పులిబెట్టారు. మూడ్రోజుల తర్వాత గురువారం తాము ఉంచిన కుండల కోసం వెళ్లిన గ్రామస్థులకు అక్కడ మద్యం తాగి ఉన్న ఏనుగులు కనిపించాయి. మొత్తం 24 ఏనుగులు ఇప్ప పువ్వు పులియబెట్టిన నీటిని తాగి మైకంలో అక్కడే నిద్రపోయాయి. ఈ 24 ఏనుగుల్లో తొమ్మిది ఏనుగులు మగవి, ఆరు ఆడవి, తొమ్మిది పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులను గ్రామస్థులు లేపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల మందను నిద్ర లేపేందుకు డప్పులు కొట్టాల్సి వచ్చింది. ఆ శబ్దానికి నిద్ర లేచిన ఏనుగులు అడవి లోపలికి వెళ్లిపోయాయి.