40 ఏళ్ళ తర్వాత ఉలిక్కిపడే నిజాలు.. తల్లిదండ్రులు బతికే ఉన్నా 2 లక్షల మంది పిల్లలు అనాథలుగా..!

ABN , First Publish Date - 2022-12-12T14:43:58+05:30 IST

తల్లిదండ్రులు బతికుండగానే వారు చనిపోయినట్టు ఆధారాలు చూపించి

40 ఏళ్ళ తర్వాత ఉలిక్కిపడే నిజాలు.. తల్లిదండ్రులు బతికే ఉన్నా 2 లక్షల మంది పిల్లలు అనాథలుగా..!

ఓ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాల కోసం వలస వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తమ సమస్యలను చక్కబెట్టుకోవచ్చనేది వారి ఆలోచ. ఈ క్రమంలోనే తమ పిల్లాడిని దగ్గరలో ఉన్న చైల్డ్ కేర్ సెంటర్లో వదిలి వారు వెళ్ళిపోయారు. సంవత్సరం తరువాత ఆ తల్లిదండ్రులు తిరిగి వచ్చి తమ పిల్లాడి కోసం చూస్తే అక్కడ పిల్లాడు లేడు. ఏమైపోయాడో మాకు తెలియదంటూ ఆ చైల్డ్ కేర్ సంస్థ వారు చెప్పేశారు. పోలీసులు, ప్రభుత్వం ఇలా ఎవరిని సంప్రదించినా ఆ పిల్లాడి ఆచూకీ తెలియలేదు. అయితే 40 సంవత్సరాల తరువాత విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇంతకూ ఏం జరిగింది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న విషయమేంటి అంటే..

తల్లిదండ్రులు బతికుండగానే వారు చనిపోయినట్టు ఆధారాలు చూపించి వివరాలు మొత్తం తారుమారు చేసి పిల్లలను అనాథలుగా మార్చేశారు. అనంతరం ఆ పిల్లలను దత్తతపై విదేశాలకు పంపారు. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 2లక్షల మంది పిల్లలను దత్తత పంపినట్టు విచారణలో వెల్లడైంది.

దక్షిణ కొరియాలో 1950 నుండి 1980 సంవత్సరాల మధ్య ఇలాంటి సంఘటనలు చాలా పెద్ద మొత్తంలో జరిగాయట. సుమారు 2లక్షలమంది పిల్లలను ఇలా తప్పుడు ఆధారాలతో విదేశాలకు దత్తత పంపినట్టు దర్యాప్తులో తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో యావత్ ప్రపంచం మొత్తం విస్తుపోయింది. సుమారు 400మంది వ్యక్తులు తాము ఎవరి పిల్లలమో వివరాలు కావాలని.. దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

తమ సొంత తల్లిదండ్రులు బతికే ఉన్నా వాళ్లను చనిపోయినట్టు చూపించి ఇలా చేయడం చాలా దారుణమని పేర్కన్నారు. దక్షిణ కొరియా యుద్ధ సమయంలో సంరక్షణ కేంద్రాలకు తరలించిన పిల్లల్లో చాలా మంది పరిస్థితి ఇలానే ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా ఇటీవలకాలంలో చోటుచేసుకున్న రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 2లక్షల మంది పిల్లలు కిడ్నాప్‌కు గురయ్యారని.. వారిని రష్యాకు తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా ప్రధాని కూడా యుద్ధం ప్రారంభించడానికి ముందే విదేశీ పిల్లలను దత్తత తీసుకోవడానికి ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దేశాల మధ్య ఉండే శతృత్వం, వారి పంతం, ప్రభుత్వాల నిర్లక్ష్యం మొదలైనవి అన్నీ ఎందరో చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాయి.

Updated Date - 2022-12-12T14:44:01+05:30 IST