UAE: వాహనదారులకు అబుదాబి పోలీసుల వార్నింగ్.. డ్రైవింగ్లో ఉన్నప్పుడు మొబైల్ వాడితే..
ABN , First Publish Date - 2022-09-17T18:43:31+05:30 IST
వాహనదారులకు అబుదాబి పోలీసులు తాజాగా వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ వాడొద్దని హెచ్చరించారు.
అబుదాబి: వాహనదారులకు అబుదాబి పోలీసులు (Abu Dhabi Police) తాజాగా వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ వాడొద్దని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఒకటని తెలిపారు. మొబైల్ వాడుతూ డ్రైవింగ్ (Driving) చేయడం వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేస్తూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ అవగాహన వీడియోను ఈ సందర్భంగా అబుదాబి పోలీసులు పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎమిరేట్లో 1లక్ష కంటే ఎక్కువ మంది వాహనదారులు సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు. ఎమిరేట్ ట్రాఫిక్ చట్టం ఉల్లంఘన నిబంధనల ప్రకారం వారికి 800 దిర్హమ్స్(రూ.17,356) జరిమానా విధించినట్లు చెప్పారు. అలాగే వారి ఖాతాల్లో 4 బ్లాక్పాయింట్లు వేసినట్లు పేర్కొన్నారు.
అబుదాబి పోలీస్లోని ట్రాఫిక్ డైరెక్టరేట్ చీఫ్ మేజర్ మహమ్మద్ దహి అల్ హుమిరి మాట్లాడుతూ... ఇక ఎమిరేట్ రోడ్లపై ఉన్న హై-టెక్ రాడార్లు మొబైల్ ఫోన్ డ్రైవింగ్ను గుర్తిస్తాయన్నారు. ఆధునాతన వ్యవస్థతో కూడిన స్మార్ట్ పెట్రోలింగ్ కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయన్నారు. చాలా మంది ఫోన్లలో మాట్లాడటం లేదా సందేశాలు పంపుతూ పట్టుబడ్డారని తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో చాట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఫొటోలు తీయడం లేదా వీడియోలు చిత్రీకరించడం వంటివి చేస్తూ ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం ప్రమాదాలకు దారితీస్తున్నాయన్నారు.