లండన్‌లో ఘనంగా టాక్ 'చేనేత బతుకమ్మ దసరా' సంబరాలు 2022

ABN , First Publish Date - 2022-10-05T15:03:21+05:30 IST

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో 'చేనేత బతుకమ్మ-దసరా' సంబరాలు ఘనంగా జరిగాయి.

లండన్‌లో ఘనంగా టాక్ 'చేనేత బతుకమ్మ దసరా' సంబరాలు 2022

ప్రత్యేక ఆకర్షణగా యాదాద్రి దేవాలయ నమూన ప్రతిమ

ముఖ్య అతిధిగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో 'చేనేత బతుకమ్మ-దసరా' సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి రెండు వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత హై కమీషన్ ప్రతినిధి లక్ష్మి నారాయణన్, స్థానిక హౌన్సలౌ డిప్యూటీ మేయర్ కౌన్సిలర్ ఆదేశ్ ఫర్మాన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా నేడు కూడా వేడుకలను 'చేనేత బతుకమ్మ దసరా' గా జరుపుకున్నామని సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.


ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో తెలంగాణలోని ఎదో ఒక ముఖ్యమైన చారిత్రాత్మక కాట్టడాల నమూనాని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతున్నామని, నేడు యాదాద్రి దేవాలయ నమూనాని ప్రదర్శించామని రత్నాకర్ తెలిపారు. 'చేనేత బతుకమ్మ దసరా' ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ టాక్ వ్యవస్థాపకుడిగా ఒక తెలంగాణ కార్యకర్తగా దాదాపు దశాబ్ద కాలం లండన్ గడ్డపై పని చేశానని, నేడు అతిథిగా అదే గడ్డపై ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా గర్వంగా ఉందన్నారు. ఇంతటి గౌరవాన్ని కల్పించి చైర్మన్‌గా అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ముందుగా కృతఙ్ఞతలు తెలిపారు.


లండన్‌లోని టాక్ కార్యవర్గం అన్ని సందర్భాల్లో వెంటే ఉండి ప్రోహించారని, తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో ప్రత్యేక గుర్తింపుని గౌరవాన్ని పొందారని అనిల్ తెలిపారు. యూకే ప్రవాస సమాజమంటే ప్రత్యేక గౌరవముందని, ఎక్కడికి వెళ్లినా ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాని వారందరికీ రుణపడి ఉంటానని అనిల్ అన్నారు. నేడు ప్రభుత్వంలో భాగస్వాములైనందున ప్రవాస మిత్రులకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని, అన్ని వేళలా సంప్రదించొచ్చునని అనిల్ తెలిపారు. టాక్ సంస్థ ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయ్యాలని, ఎక్కడున్నా తన సహాయం ఉంటుందని, మాతృ సంస్థల్ని మర్చిపోయేవాడిని కాదని అనిల్ తెలిపారు.


నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి జాతీయ పార్టీని స్థాపిస్తున్నారని, నాడు ఎలాగైతే మనమంతా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెంటే ఉండి విజయం సాధించామో, నేడు దేశ అభివృద్ధి కోసం కేసీఆర్ వెంటే నడిచి మరోక ఉద్యమానికి సిద్ధం కావాలని అనిల్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు హాజరైన అతిథులంతా "దేశ్ కా నేత కేసీఆర్ " అంటూ నినాదాలు చేశారు. ప్రవాసులంతా కేసీఆర్ వెంటే ఉంటామని నినదించారు.


మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుండి తెచ్చిన జమ్మీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా "అలాయ్-బలాయ్" కార్యక్రమం లో చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం మార్చుకున్నారు. ఆ తర్వాత జమ్మీ( బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


జమ్మీ ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్-బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి  చూపించారని పలువురు ప్రశంశించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మద్య ఏర్పాటు చేసిన యాదాద్రి దేవాలయ నమూన ప్రతిమ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులందరి ప్రశంసలందుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా వినూత్నంగా ఎదో ఒకటి చేస్తామని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ మల్లా రెడ్డి తెలిపారు. విదేశాల్లో స్థిరపడ్డ కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా చిన్నచిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే  తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా వినూత్నంగా ఏర్పాటు చేసిన యాదాద్రి దేవాలయ నమూన ప్రతిమ చాలా ఆకర్షణీయంగా ఉందని టాక్ సంస్థను అభినందించారు.


ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ, ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవితకి టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు.


ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మన పండగలకు మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగలుగుతున్నామని తెలిపారు. కాబట్టి కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.


టాక్ కార్యదర్శులు రవి రేతినేని, సుప్రజ పులుసు మాట్లాడుతూ మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన మీడియా సంస్థలకు, స్థానిక ప్రభుత్వ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి లండన్ విచ్చేసి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ కూర్మాచలంను టాక్ కార్యవర్గం ఘనంగా సత్కరించి, అభినందన పత్రాన్ని అందించింది. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజువారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు. యాదాద్రి దేవాలయ నమూన ప్రతిమను నిర్మించిన వారి సృజనాత్మకతను కృషిని అభినందిస్తూ మల్లారెడ్డి శుష్మణ దంపతులను టాక్ సంస్థ నుండి చేనేత శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఉత్తమ బతుకమ్మకు, బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు. 


ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం - జాహ్నవి దుసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అఫైర్స్  చైర్మన్ నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, మాధవ్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య, శ్రీ విద్య, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్, రాజేష్ వర్మ, క్రాంతి రేటినేని, మమత జక్కీ, శ్వేతా మహేందర్, మధుసూదన్ రెడ్డి, శ్వేతా రెడ్డి, శశి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, సందీప్ బుక్క, అక్షయ్, మౌనిక, ప్రవీణ్ వీర, రంజిత్, వంశీ, నరేష్, నాగరాజు, మ్యాడి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Updated Date - 2022-10-05T15:03:21+05:30 IST