TANTEX: ఘనంగా 'నెలనెలా తెలుగు వెన్నెల' 181వ సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-08-23T19:26:18+05:30 IST

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈనెల 21న జరిగిన 181వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

TANTEX: ఘనంగా 'నెలనెలా తెలుగు వెన్నెల' 181వ సాహితీ సదస్సు

ఎన్నారై డెస్క్: నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈనెల 21న జరిగిన 181వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారం తెలిపి, కార్యక్రమం పుట్టుపూర్వోత్తరాలను సభికులకు గుర్తు చేశారు. చిరంజీవి భవ్యతనలే మధుర గాత్రంతో ఆలపించిన ''గోవింద గోవిందయని కొలువరే'' అన్నమాచార్య కీర్తన సాహిత్య ప్రియులను భక్తి పారవశ్యంలో తెలియాడేలా చేసింది. ఆధునిక పద బంధ ప్రహేళికా చక్రవర్తి ఊరిమిండి నరసింహారెడ్డి తన సాహిత్యయజ్ఞంలో అందరినీ భాగస్వాములను చేయాలనే సత్సంకల్పంతో 2018 నుండి నేటివరకు ప్రతినెలా నిర్వహిస్తున్న"మన తెలుగు సిరిసంపదలు" కార్యక్రమంలో ప్రహేళికలు, అంతర్లాపిక ప్రహేళికలు జానపద సాహిత్య మిళితమైన పొడుపు కథలు చమత్కార పద్యాలు వాటిలో పూరణ చేయవలసిన పదాలను ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను తీవ్రముగా ఆలోచింపచేసి వారి నుండి సరియైన సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగిస్తున్నారు. 


ఎప్పటిలాగే ఈ నెలలో కూడా ఒక వినూత్న ప్రయోగంతో ప్రపంచవ్యాప్త సాహితీప్రియుల మెదడుకు మేత వేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి అందరి ప్రశంసలనందుకున్నారు. ప్రతి నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట, రాధ కాశీనాధుని కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. డాక్టర్ ఉపద్రష్ట సత్యం నేటి పద్య సౌగంధం కార్యక్రమములో ఆధునిక వాంగ్మయ కవి పుంగవులు ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక హాత్యములోని అత్యంత భక్తిరస పద్యమును చదివి సందర్భ సహిత వ్యాఖ్యతో సహా భావార్ధాలను సులభరీతిలో వివరించి జీవన్ముక్తికి భక్తితో సాధన చేయుట ఒక్కటేమార్గమని ఉద్బోధించారు.


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 181వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి డాక్టర్ తాళ్లూరి ఆంజనేయులు '' ప్రాచీన తెలుగు సాహిత్యంలో నన్నయ పాత్ర'' అంశంపై అద్భుతమైన ప్రసంగం చేశారు. నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారని, వీరి తరువాత కవులందరూ ఒకసారికాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగుజాడలను అనుసరించినవారేననీ తెలిపారు. వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథా మూలానువాదశ్లోకానికి ఒక్కో పద్యం అన్న పద్ధతి పెట్టుకోలేదనీ, 'భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం' అన్నాడనీ గుర్తు చేశారు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడని తెలిపారు. తిక్కన, ఎర్రనలు అదే ప్రణాళికను అనుసరించి అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేశారన్నారు.  అప్పటి నుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యిందని చాలా స్పష్టంగా చెప్పారు. 


నన్నయ తన ముగింపు పద్యంలో ''శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి” అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనిపించడం లేదు. “వికసించిన కలువల సుగంధాన్ని మోసుకు పోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు'' అని నన్నయ వర్ణించిన విధానాన్ని చాలా విపులంగా వివరించారు ఆంజనేయలు. ఆదికవి నన్నయ చేసిన ఆయా వర్ణనలను వివరిస్తూ అమృత తుల్యమైన తన ప్రసంగానికి ముగింపు వాక్యాలు పలకడంతో నేటి ముఖ్యఅతిధి చల్లని వెన్నెలను శీతల వాయుసహిత హిమాన్ని తనతో పాటు తెచ్చి మనపై కురిపించి నట్లుగా భావిస్తున్నామని పలువురు సాహితీ ప్రియులు డాక్టర్ తాళ్లూరి ఆంజనేయలు అభినంచారు. 


నేటి ''మాసానికో మహనీయుడు'' శీర్షిక క్రింద ఆగస్టు నెలలో జయంతి, వర్ధంతి జరుపుకుంటున్న ప్రముఖ కవుల సాహితీవేత్తల వివరాల్ని అధిక శ్రమకోర్చి సేకరించి ఆయా రచయితలను గుర్తు చేయడమేగాక  ''మా తెలుగు తల్లికి మల్లెపూదండ మాకన్నతల్లికి మంగళారతులు'' వంటి అద్భుతమైన పాటకు మూలాధారముగా చెప్పబడుతున్న పద్యమును తేటగీతిలో రచించిన ప్రముఖకవి శ్రీశంకరంబాడి సుందరాచారి జీవితవిశేషాల్ని వారు వ్రాసిన రచనల్ని సవివరముగా వివరించిన డా.అరుణజ్యోతి రెడ్డి కోలా కృషి ప్రసంశనీయం. సిద్ధకవి శ్రీపాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రస్తుతం అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి ధ్యానమొక్కటే మార్గమని చెప్తూ ధ్యానము ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవడానికి మార్గదర్శకులైన విశ్వస్ఫూర్తి గురువరేణ్యులు గురించీ వారు వ్రాసిన ''ధ్యానమనోప్రస్థానం'', ''ప్రస్థానసాధన'' వంటి ధ్యాన సంబంధ పుస్తకాలములను చదవవలసిన అవశ్యకతను విపులంగా వివరించారు.


సంస్థ ప్రస్తుత అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి నేటి సభను విజయవంతం చేసిన ప్రముఖ సాహితీవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలపడమేగాక పాలపర్తి శ్యామలానంద ప్రసాదు వెల్లడించిన ధ్యాన సంబంధ సూచనలు ఆచరణ సాధ్యమేనని సర్వదా అందరికీ ఆమోదయోగ్యమేనని అన్నారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన ముఖ్యఅతిథి డాక్టర్ తాళ్లూరి ఆంజనేయుకు జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనాగీతం పాడిన చిరంజీవి భవ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2022-08-23T19:26:18+05:30 IST