దమ్మాంలో ఘనంగా సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-09-28T13:54:48+05:30 IST

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ, సౌదీ అరేబియాకు వచ్చిన తెలుగు వారు ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు ఆపన్నహస్తాన్ని అందించాలనే లక్ష్యంతో స్ధాపించబడిన "సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య" ప్రథమ వార్షిక వేడుకులను శుక్రవారం నిర్వహించింది.

దమ్మాంలో ఘనంగా సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ, సౌదీ అరేబియాకు వచ్చిన తెలుగు వారు ఎవరైనా కష్టాలలో  ఉన్నప్పుడు  ఆపన్నహస్తాన్ని అందించాలనే లక్ష్యంతో స్ధాపించబడిన "సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య" ప్రథమ వార్షిక వేడుకులను శుక్రవారం నిర్వహించింది. సౌదీలోని పారిశ్రామిక నగరమైన దమ్మాంలో అట్టాహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో దమ్మాం, అల్ ఖోబర్ జంట నగరాలతో పాటు పరిసర పారిశ్రామిక ప్రాంతాలలో పని చేస్తున్న తెలుగు ప్రవాసీయులు కూడా పాల్గొన్నారు. ప్రవాసంలో ప్రమాదవశాత్తు జరిగే దుర్ఘటనల కారణంగా ప్రభావితమయ్యే ప్రవాసీయుల సంక్షేమానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్ధ అయిన ఏపీఎన్నార్టీస్ సంస్థ అమలు చేస్తున్న ప్రవాసాంధ్రుల భీమా పథకం ఉద్దేశాలను ఏపీఎన్నార్టీస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్ ఈ సందర్భంగా జూమ్ ద్వార వివరించారు.


సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యా అధ్యక్షులు చందగానీ నాగశేఖర్ సంస్ధ ఆవిర్భావ లక్ష్యాలను, విలువలు, ఇప్పటి వరకు అందించిన సేవలను సభికులకు వివరించారు. కార్యక్రమాన్ని సామాజిక సేవకులు జహీర్ బేగ్ జ్యోతి ప్రజ్వలించి ప్రారంభించారు. ఖురాన్ పఠనంతో మరియు మహిళా బృందం పాడిన మా తెలుగు తల్లి పాటతో స్వాగతం పలికారు. సంయుక్త కార్యదర్శి కోనేరు ఉమా మహేశ్వర రావు  వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.


సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యులు పారేపల్లి యన్‌వీబీ కిషోర్, వరప్రసాద్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు (పాటలు, నృత్యాలు, నాటికలు) ప్రత్యేకించి చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దమ్మాం కేంద్రంగా పని చేస్తున్న సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యాకు అధ్యక్షులు నాగశేఖర్ చందగాని, ఉపాద్యక్షులు పారేపల్లి యన్‌వీబీ కిషోర్, ప్రధాన కార్యదర్శి పాపారావు, సంయుక్త కార్యదర్శి ఉమా మహేశ్వరారావు కోనేరు, సాంస్కృతిక ఉపాధ్యక్షుడు రామ శర్మ చివుకుల, వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ రిలేషన్స్) వర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ (ప్రభుత్వ సంబంధం) గులాం షేక్, సాంకేతిక ఉపాధ్యక్షుడు దిలీప్, కోశాధికారి హరి కృష్ణ, ఉమ్మడి కోశాధికారిగా నరసింహా రావు రాంపల్లి వ్యవహరిస్తున్నారు.












Updated Date - 2022-09-28T13:54:48+05:30 IST