తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ సమావేశం
ABN , First Publish Date - 2022-02-20T01:11:07+05:30 IST
ఇండియా- శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం జరిగింది.
ఇండియా- శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యాపార, పర్యాటక, సాంకేతిక రంగాల్లో అవకాశాలను గుర్తించి ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ‘డయాస్పోరా 4 డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ’ పేరుతో కాన్సుల్ జనరల్ ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. కాన్సుల్ జనరల్ డా. నాగేంద్ర ప్రసాద్ , కాన్సుల్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్తో సహా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాపార, పర్యాటక, సాంకేతిక రంగాల్లో అవసరమైన తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు సంతతికి చెందిన 50 మంది ప్రముఖ వక్తలు పాల్గొన్నారు.
డాక్టర్ నాగేంద్ర ప్రసాద్తో పాటు కాకతీయ సాండ్బాక్స్ సహ వ్యవస్థాపకుడు రాజురెడ్డి, ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా మాజీ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, యాంకర్ వాలీ పార్ట్నర్స్ ప్రిన్సిపల్ సిద్ధార్థ లక్కిరెడ్డి, సిలికాన్ ఆంధ్ర యూనివర్సీటీ ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభోట్ల, పసిఫిక్, ఏఏపీఐ ప్రాంతీయ డైరెక్టర్ సుజీత్ పున్నం, గ్లోబల్ ఇండస్ట్రీ అనలిస్ట్స్ వ్యవస్థాపకుడు రామ్రెడ్డి, హై5 యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ సుందర్, ఫాలక్కన్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు బీవీ జగదీశ్, బే ఏరియా తెలుగు సంఘం సలహా బోర్డు ప్రతినిధి డాక్టర్ రమేష్ కొండా, తెలంగాణా కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విజయ్ చావా, ఏపిఎన్ఆర్టీ సొసైటీ బే ఏరియా ప్రతినిధి వెంకట రెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు కమ్యూనిటీలో అందరికీ సుపరిచితురాలైన విజయ అసూరి ఈ సమావేశాన్ని ముందుండి నడిపించారు.