ఇండియాకు గుడ్ బై చెప్తున్న భారతీయులు!

ABN , First Publish Date - 2022-12-09T18:43:52+05:30 IST

భారత ప్రభుత్వం తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఎంత మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారనే వివరాలను..

ఇండియాకు గుడ్ బై చెప్తున్న భారతీయులు!

ఎన్నారై డెస్క్: భారత ప్రభుత్వం తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఎంత మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారనే వివరాలను తెలిపింది. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్యను చెప్పింది. ఇదే సమయంలో భారత పౌరసత్వాన్ని పొందిన విదేశీ పౌరుల సంఖ్యను కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 31 నాటికి దేశ పౌరసత్వం వదులుకున్న భారత పౌరుల సంఖ్యను వెల్లడించారు. గడిచిన సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నాటికే అత్యధికంగా 1.83లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు స్పష్టం చేశారు. 2015లో 1.31లక్షల మంది, 2016లో 1.41లక్షల మంది, 2017లో 1.33లక్షల మంది, 2018లో 1.34లక్షల మంది, 2019లో 1.44లక్షల మంది, 2020లో 85వేల మంది, 2021లో 1.63లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు సభకు వివరించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన వందలాది మంది పౌరులు భారత పౌరసత్వాన్ని పొందినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-09T20:00:56+05:30 IST