Indian Govt: ఆ ఉద్యోగ ప్రకటనలు అస్సలు నమ్మకండి.. యువతను కోరిన భారత ప్రభుత్వం!
ABN , First Publish Date - 2022-09-26T17:02:57+05:30 IST
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు నమ్మాలో వద్దో కూడా తెలియని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నెట్టింట వైరల్ అయ్యే.. ఉద్యోగ ప్రకటనలున అస్సలు
ఎన్నారై డెస్క్: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు నమ్మాలో వద్దో కూడా తెలియని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నెట్టింట వైరల్ అయ్యే.. ఉద్యోగ ప్రకటనలున అస్సలు నమ్మవద్దని యువతను భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో కోరింది. ముఖ్యంగా థాయ్లాండ్లో జాబ్ ఆఫర్స్ అంటూ వచ్చే ప్రకటలను అస్సలు పట్టించుకోవద్దని సూచించింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముందుగా చెప్పుకున్నట్టు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. రకరకాల ప్రకటనలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దుబాయ్, ఇండియా కేంద్రంగా కొందరు మోసగాళ్లు.. థాయ్లాండ్లో ఉద్యోగాల పేరుతో పలు డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా యువతకు గాలం వేస్తున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగ ప్రకటనలను చూసి, సంప్రదిస్తున్న యువతకు ఆ కేటుగాళ్లు.. థాయ్లాండ్లో మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించింది. అంతేకాకుండా యవతను అక్రమంగా దేశం దాటిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో భారత పౌరులను అలర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దని సూచించింది.
ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్లో ఉద్యోగాల ప్రకటనలను చూసి థాయ్లాండ్ వెళ్లేందుకు మయన్మార్లో అక్రమంగా నివాసం ఉంటున్న 30 మంది భారతీయులను ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారులు రక్షించారు. ఈ 30 మందిలో తమిళనాడుకు చెందిన యువకులే అత్యధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాదాపు 300 మంది పౌరులు థాయ్లాండ్కు వెళ్లేందుకు భారత్ను వీడినట్టు గుర్తించిన అధికారులు.. వారి ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.