బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ రూ.10 లక్షల విరాళం
ABN , First Publish Date - 2022-09-18T03:56:07+05:30 IST
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా మూడవ సంవత్సరం రూ.10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అందించింది.
ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపు సంఘం మహిళలను అభినందిస్తున్నట్లు సునీత తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా బాలభారతి పాఠశాలకు వస్తూ ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని సునీత తెలిపారు. ప్రవాసుల సేవానిరతిని సునీత అభినందించారు. కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ స్ఫూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిథులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. స్వయంకృషితో ఎదిగిన సునీత లాంటి కళాకారులు అందరికీ ఆదర్శమని మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కోశాధికారి విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి పద్మావతమ్మ, ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘంకు చెందిన పలువురు మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.