Foreign tourists: భారీగా తగ్గిన విదేశీ సందర్శకుల రాక.. కానీ ఎన్నారైలు మాత్రం..

ABN , First Publish Date - 2022-09-29T17:16:15+05:30 IST

2020తో పోలిస్తే 2021లో విదేశీ సందర్శకుల రాక భారీగా పడిపోయినట్లు పర్యాటక శాఖ వెల్లడించింది.

Foreign tourists: భారీగా తగ్గిన విదేశీ సందర్శకుల రాక.. కానీ ఎన్నారైలు మాత్రం..

న్యూఢిల్లీ: 2020తో పోలిస్తే 2021లో విదేశీ సందర్శకుల (Foreign tourists) రాక భారీగా పడిపోయినట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. మంగళవారం వెలువడిన టూరిజం గణాంకాలు-2022 నివేదిక ప్రకారం 2020లో 2.74 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించగా.. 2021లో ఈ సంఖ్య 1.52 మిలియన్లకు పడిపోయింది. ఏడాది కాలంలో 44.5శాతం మేర పర్యాటకుల సంఖ్య పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా ప్రయాణ ఆంక్షలేనని పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఎన్నారైల (NRIs) సంఖ్య 52.6శాతం మేర పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది. 


ఇక 2021లో భారతదేశాన్ని సందర్శించిన టాప్-15 దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, కెనడా, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. గతేడాది ఇండియాకు వచ్చిన విదేశీ పర్యాటకుల్లో 81శాతం మంది పైన పేర్కొన్న దేశాల నుంచే వచ్చారు. కాగా, పర్యాటకం దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే ముఖ్యమైన అంశాలలో ఒకటి. ఇలా విదేశీ సందర్శకుల ద్వారా పర్యాటక శాఖకు 2021లో ఏకంగా 8.797 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. 2020లో ఇది కేవలం 6.959 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదిలాఉంటే.. 2020తో పోలిస్తే 2021లో దేశం విడిచి వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. 2020లో 70.29లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్లగా.. 2021లో ఈ సంఖ్య 80.55లక్షలకు చేరింది. ఏడాది వ్యవధిలో 7.3శాతం మేర పెరిగింది. 

Updated Date - 2022-09-29T17:16:15+05:30 IST