Flight Service: షార్జాకు విమాన సర్వీస్.. 122 మందితో వెళ్లిన తొలి విమానం

ABN , First Publish Date - 2022-11-01T11:55:25+05:30 IST

గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జాకు బయల్దేరిన మొదటి ఎయిర్‌ ఇండియా విమానానికి విశేష స్పందన లభించింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు షార్జా నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణమైంది.

Flight Service: షార్జాకు విమాన సర్వీస్.. 122 మందితో వెళ్లిన తొలి విమానం

జెండా ఊపి ప్రారంభించిన బందరు, విజయవాడ ఎంపీలు

గన్నవరం విమానాశ్రయంలో పండుగ వాతావరణం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం): గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జాకు బయల్దేరిన మొదటి ఎయిర్‌ ఇండియా విమానానికి విశేష స్పందన లభించింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు షార్జా నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణమైంది. 50 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం 122 మందితో తిరుగు ప్రయాణమైంది. ఈ విమానానికి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని నాని జెండా ఊపారు. అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చారు. ఈ అంతర్జాతీయ విమానం వారంలో రెండు రోజులు సోమ, శనివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. విమాన సర్వీసు ప్రారంభించటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ సర్వీసు ద్వారా గల్ఫ్‌ దేశాలకు విజయవాడ నుంచి కనెక్టివిటీ ఏర్పడింది. దుబాయి, అబుదబి, రస్‌ ఆల్‌ఖైమా వంటి దేశాలు, ఇతర అనేక అరబ్‌ దేశాలకు చేరుకునే వీలు కలిగింది.

ఆక్యుపెన్సీని బట్టి డైలీ నడుపుతాం..

విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభించటానికి ఎంతో కృషి చేశాం. సర్వీసు ప్రారంభం కావటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం వారంలో రెండు రోజుల పాటు నడుస్తుంది. ఆక్యుపెన్సీ పెరిగితే డైలీ నడుపుతాం. ఇప్పటికే విజయవాడ నుంచి మస్కట్‌కు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించాం. విజయవాడకు కువైట్‌ నుంచి మరో రెండు వన్‌వే విమానాలు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో బ్యాంకాక్‌, మలేషియా, సింగపూర్‌కు కూడా నడుపుతాం. -వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ

ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కృషి చేశాం..

షార్జాకు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కావటం ఆనందంగా ఉంది. 2014కు ముందు ఈ ఎయిర్‌పోర్టు బస్టాండ్‌ కంటే తక్కువగా ఉండేది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు హయాంలో అభివృద్ధి చెందింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం 700 ఎకరాల భూములను సేకరించి అప్పగించాం. టీడీపీ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టు భూముల కోసం రూ.2,400 కోట్లు ఖర్చు చేశాం. ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం మరో రూ.1,000 కోట్లు ఖర్చు చేశాం. రూ.130 కోట్లతో పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ టెర్మినల్‌గా అభివృద్ధి చేశాం. టాటా కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా విజయవాడకు మరిన్ని సర్వీసులు తీసుకురావటానికి కృషి చేస్తా. -కేశినేని శ్రీనివాస్‌, విజయవాడ ఎంపీ

వైసీపీ నేత ఓవరాక్షన్‌.. చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌తో గొడవ

షార్జాకు అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించే సందర్భంలో విజయవాడ విమానాశ్రయంలో ఘర్షణ చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ గోసాని ఎయిర్‌పోర్టులో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, ఎస్పీఎఫ్‌ ఏసీపీ వెంకటరత్నంపై చిందులు వే శాడు. అనుమతి ఉన్న వారినే లోపలకు పంపిస్తుండటంతో గోసాని అత్యుత్సాహంతో లోపలికి ప్రవేశించాడు. వెంకటరత్నం వారించే ప్రయత్నం చేయగా, గోసానికి కోపం కట్టలు తెంచుకుంది. ‘ఎవడ్రా నువ్వు..’ అంటూ విరుచుకుపడ్డాడు. లోకల్‌ జడ్పీటీసీ సభ్యుడినని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తా.. అంటూ దూసుకొచ్చాడు. పక్కనే ఉన్న నాయకులు వారించే ప్రయత్నం చేసినా వినలేదు.

Updated Date - 2022-11-01T11:55:27+05:30 IST