NRI: అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగించాలి: బోండా ఉమామహేశ్వరరావు

ABN , First Publish Date - 2022-09-11T23:08:47+05:30 IST

అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగించాలని మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన విధ్వంసపూరిత ఆలోచనలు మాని, కక్షసాధింపు ధోరణి వీడి రాష్ట్రాభివృద్ధికి కృషిచేయాలని హితవు పలికారు.

NRI: అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగించాలి: బోండా ఉమామహేశ్వరరావు

అమరావతి రాజధాని(Amaravati) నిర్మాణం కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన విధ్వంసపూరిత ఆలోచనలు మాని, కక్షసాధింపు ధోరణి వీడి రాష్ట్రాభివృద్ధికి కృషిచేయాలని హితవు పలికారు. సెప్టెంబర్ 10న వాషింగ్టన్ డీసీలో(Washington DC) అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయాలి’, ‘అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి’, ‘అలుపెరగని ఉద్యమం.. అమరావతి ఉద్యమం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు.


ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. ‘‘జగన్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయనిదే 3 రాజధానులు సాధ్యం కాదని జగన్ రెడ్డికి తెలుసు. అయినా రాష్ట్ర ప్రజలను వంచిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా మొండిగా వ్యవహరించడం మంచిదికాదు’ అని అన్నారు. కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా సీఆర్డీయే చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ‘‘అమరావతి రాజధాని ప్రాంతాన్ని గతంలో మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తే దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి మరలా 22 గ్రామాలతో మున్సిపాలిటీగా ప్రకటించడంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.  


మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘కోర్టు తీర్పు తర్వాతనైనా అభివృద్ధి పనులు కొనసాగిస్తారని ప్రజలు ఆశించారు. కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోగా.. తిరిగి మూడు రాజధానులంటూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. రాష్ట్రం తగులబడుతుంటే చలికాచుకుంటూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు’’ అని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలను చైతన్యపరిచేందుకు అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. వారికి మద్దతుగా అమెరికాలో ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. డా. యడ్ల హేమప్రసాద్ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని మాత్రమే కాదు.. అది సంపద సృష్టించే నగరమని చెప్పారు. దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.


తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు తన సంఘీభావం తెలిపారు. భాను మాగులూరి, మన్నవ వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి బొల్లినేని, రామకృష్ణ ఇంటూరి, ఈశ్వర్ కక్కెర, ధూళిపాళ్ల వీరనారాయణ, నాగ్ నెల్లూరి, రామ్ జక్కంపూడి, గుత్తా రమేష్ బాబు, కోట రామ్మోహన్, సుధీర్ కొమ్మి, కిషోర్ కంచర్ల, యాష్ బొద్దులూరి, సత్య సూరపనేని, అనిల్, రవి జాగర్లమూడి, జగన్మోహన్ రావు ముప్పనేని, జవహర్ లాల్ పెద్ది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T23:08:47+05:30 IST